స్థానికంలో లెక్కలు వేరుగా ఉంటాయి: జనసేన

త్వ‌ర‌లో ఏపీలో జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీలోని ఆశావ‌హుల‌కు అంద‌రికీ పోటీ చేసే అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని జ‌న‌సేన ముఖ్య నాయ‌కుడు, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ చెప్పారు. ఆశావ‌హుల‌ను నిరాశ‌ప‌రిచే ప్ర‌స‌క్తి లేదన్నారు. స్థానిక ఎన్నిక‌ల్లో ప‌నిచేసేందుకు ఇప్ప‌టి నుంచే నాయ‌కులు, కార్య‌కర్త‌లు సంసిద్ధులు కావాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు. ముఖ్యంగా పార్టీ బ‌లంగా ఉన్న చోట ఎన్ని స్థానాల్లో అయినా పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కూట‌మి బ‌లంగా ఉండాల‌న్న ఉద్దేశంతో 21 స్థానాల‌కు ప‌రిమిత‌మ‌య్యామ‌ని నాదెండ్ల వ్యాఖ్యానించారు. అయితే, ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌బోవ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం పార్టీ ప‌రంగా బ‌లంగా ఉన్నామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోనే స్థానికంగా పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశామ‌న్నారు. స్థానిక ఎన్నిక‌ల్లో సాధ్య‌మైన‌న్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు చెప్పారు.

ఈ మేర‌కు విజ‌య‌వాడ‌లో మంత్రి నాదెండ్ల మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థ‌ల‌పై పార్టీ నాయ‌కులు, కేడ‌ర్ కూడా చాలానే ఆశ‌లు పెట్టుకున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. వీరిని సంతృప్తి ప‌రిచేందుకు పార్టీ అన్ని ర‌కాల చ‌ర్యలు తీసుకుంటుంద‌న్నారు. అదేస‌మ‌యంలో కూట‌మి ఔన్న‌త్యాన్ని ఎప్ప‌టికీ కాపాడుకుంటామ‌న్నారు. కూట‌మి నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం పెంచేందుకు త‌మ వంతు కృషి జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఈ విష‌యంలో పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యాన్ని అంద‌రూ పాటిస్తార‌న్నారు.

ఐక్యంగానే ముందు..

కూట‌మి పార్టీల నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం పెంచేందుకు కృషి చేస్తున్న‌ట్టు మంత్రి నాదెండ్ల తెలిపారు. ఐక్యం గానే స్థానిక సంస్థ‌లు స‌హా ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా ముందుకు సాగుతామ‌న్నారు. ఈ విష‌యంలో రెండో మాటేలేద‌ని చెప్పారు. అయితే, స్థానికంగా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల ఆశ‌ల‌ను నెర‌వేర్చ‌డం కూడా పార్టీకి ప్ర‌ధాన బాధ్య‌త‌గా పేర్కొ న్నారు. అందుకే.. స్థానిక ఎన్నిక‌ల్లో సాధ్య‌మైన‌న్ని స్థానాల‌లో పోటీ చేయాల‌ని భావిస్తున్నామ‌న్నారు.