ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార కూటమి, విపక్ష వైసీపీ మధ్య నిత్యం వాగ్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ దిశగా ఆలోచిస్తున్న కూటమి ప్రభుత్వం… స్థానిక పోరుకు సెప్టెంబరు నెలను ఎంపిక చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం. గ్రామ పంచయతీల నుంచి నగర పాలక సంస్థల దాకా వరుసబెట్టి… అన్ని స్థాయిల స్థానిక సంస్థల ఎన్నికలను ఒకే సమయంలో ముగించే దిశగా ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత మరే ఎన్నికా జరగలేదనే చెప్పాలి. రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగినా… విపక్ష వైసీపీకి లేశమాత్రమే బలం ఉన్న నేపథ్యంలో ఏ సమయానా ఎన్నికలు జరగలేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే… ఆ పోరును సార్వత్రిక ఎన్నికల స్థాయి ఎన్నికలుగానే భావించక తప్పదు. అదికారంలోకి వచ్చిన కూటమి తన రెండేళ్ల పాలనకు గీటురాయిగా స్థానిక ఎన్నికలను పరిగణిస్తే… మూడేళ్ల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికలకు స్థానిక పోరే శాంపిల్ అన్న స్థాయిలో విపక్ష వైసీపీ సాగనున్నాయి.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు చర్చ వస్తున్నా… ప్రతి సారీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఈ దఫా మాత్రం స్థానిక పోరును వాయిదా వేయడానికి కూటమి సర్కారు ససేమిరా అంటున్నట్లు వినికిడి. అంతేకాకుండా గ్రామ పంచాయతీల నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆపై మునిసిపల్ ఎన్నికలను వరుసబెట్టి ఒకే విడతలో లాగించే దిశగానే ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తొలుత మునిసిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మునిసిపల్ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు… ఆ తర్వాత చివరాఖరుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేనలకు పట్టణ ప్రాంతాల్లో విస్పష్టమైన పట్టు కలిగి ఉన్నాయి. పల్లె సీమల్లోనూ ఈ పార్టీలకు మెజారిటీ ఉన్నా… విపక్ష వైసీపీకి కూడా గ్రామల్లో మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల్లో సత్తా చాటే దిశగా కూటమిలోని అన్ని పార్టీల కేడర్ ను ఆయా పార్టీలు అప్రమత్తం చేస్తున్నాయి. ప్రభుత్వం పనితీరుకు గీటురాయిగా పరిగణిస్తున్న ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాదించే దిశగా కూటమి సర్కారు వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 27 నుంచి 45 రోజుల పాటు ప్రజా ప్రతినిధులు తమ పరిధిలోని ప్రతి గడపను టచ్ చేసేలా ప్లాన్ చేస్తోంది. ఆ దిశగా సమాయత్తం కావాలని తమ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది. విపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ఎన్నికల్లో సత్తా చాటే దిశగా కృషి చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates