జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా చెబుతుంటారు. పవన్ తన సొంత డబ్బులతో పార్టీని నడిపిస్తూ తన ఆస్తులు అమ్ముకున్న వైనంపై కూడా చర్చ జరిగింది. ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు అనేది ఎవరిని అడిగినా చెప్పే మాట.
డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ ప్రజాధనాన్ని తన సొంత దుర్వినియోగం చేయకుండా ఉన్న వైనంపై కూడా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పవన్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ప్రభుత్వం నుంచి తన వైద్యానికి అయిన ఖర్చును ప్రజాధనం నుండి క్లెయిమ్ చేసే అవకాశమున్నా సరే పవన్ ఆ పని చేయలేదు.
పవన్ భుజానికి జరిగిన శస్త్ర చికిత్సకు అయిన ఖర్చు మొత్తం తన సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారని జనసేన పార్టీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆపరేషన్ తోపాటు ప్రయాణానికి అయ్యే ఖర్చులు మొత్తం స్వయంగా పవన్ భరిస్తున్నారు.
ఇప్పుడే కాదు, గతంలో ముక్కుకి జరిగిన శస్త్ర చికిత్స కోసం కూడా సొంత డబ్బులు పవన్ వాడారు. వాస్తవానికి కేబినెట్ మినిస్టర్ హోదాలో పవన్ తన చికిత్సకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నుంచి పొందే అవకాశం ఉంది. కానీ, ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదన్న స్వీయ నిబంధనను పవన్ పాటిస్తూ మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
మరోవైపు, ఈ రోజు ఉదయం ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి పవన్ డిశ్చార్జ్ అయ్యారు. మరికొన్ని రోజుల పాటు ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత పవన్ ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుంది. మరో 6 నెలల తర్వాత ఎడమ భుజానికి కూడా రొటేటరీ కఫ్ కు సంబంధించిన ఆపరేషన్ చేయించాల్సి ఉంది. ముంబై నుంచి పవన్ నేరుగా హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకుంటారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates