ముద్రగడ నివాసంలో రాజకీయమెందుకు

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా  తీవ్ర అనారోగ్యంతో సతమతం అవుతున్న ముద్రగడ… కొన్నిరోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన భౌతికకాయాన్ని ఆయన సొంతూరు కిర్లంపూడికి తరలించగా… మంగళవారం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముద్రగడ మరణంపైనా రాజకీయాలేమిటన్న దిశగా పలువురు చర్చించుకుంటున్నారు.

కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటి వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు కారణమేమిటన్న విషయాల్లోకి వెళితే.. ముద్రగడ వైసీపీలో కొనసాగుతూ ఉంటే… ఆయన కుమార్తె క్రాంతి మాత్రం జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా కాకుండా రాజకీయాలను ఆధారం చేసుకుని క్రాంతి తన తండ్రి, ఆయన ఉంటున్న పార్టీ వైసీపీని విమర్శిస్తూ పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో క్రాంతి తన కన్న తండ్రినే రాజకీయాల కోసం వదులుకుంటోందన్న విమర్శలు రేకెత్తాయి. తన తండ్రిని వైసీపీ వాడుకుని వదిలేసిందని ఇటీవలే క్రాంతి చేసిన ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తన తండ్రి మరణించారన్న వార్తతో క్రాంతి తీవ్ర దిగ్భ్రాంతిలో కూరుకుపోయారు. ముద్రగడ పార్థీవదేహం కిర్లంపూడి చేరగానే.. ఆయనను కడసారి చూసుకుందామని క్రాంతి అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ముద్రగడ అనుచరులు క్రాంతి రాకను వ్యతిరేకించారు. క్రాంతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్రాంతి గోబ్యాక్ అంటూ పెద్ద పెట్టున నినదించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పరిస్థితిని సద్దుమణిగేలా చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగినా… ఫలితం లేకుండాపోయింది. ముద్రగడను వ్యతిరేకించిన క్రాంతికి ఆయనను చూసేందుకు అర్హత లేదని ఆయన అనుచరులు వాదించారు. చివరాఖరుకు ముద్రగడ సతీమణి కూడా క్రాంతిని వ్యతిరేకించారు.

ఎంత రాజకీయ విభేదాలు ఉన్నా… ముద్రగడ, క్రాంతి తండ్రీకూతుళ్లు కదా. కన్నతండ్రిని కడసారి చూసుకునేందుకు క్రాంతికి హక్కు లేదా? అన్న వాదనలు అయితే అక్కడ వినిపించాయి. రాజకీయంగా విభేదించుకుంటే మాత్రం ముద్రగడ… క్రాంతికి తండ్రి కాకుండా పోతారా? క్రాంతి…ముద్రగడకు కూతురు కాకుండాపోతుందా? అన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఇదే రీతిన ఆలోచన చేసిన పోలీసులు… ముద్రగడ అనుచరులతో పాటు ముద్రగడ సతీమణి వద్దని చెప్పినా.. దగ్గరుండి మరీ క్రాంతికి ముద్రగడ మృతదేహం వద్దకు తీసుకెళ్లారు. దీంతో తన కన్నతండ్రిని కడసారి చూసుకున్న క్రాంతి,… ఆయనకు కన్నీటి నివాళి అర్పించారు.