జ‌గ‌న్‌కు… త‌త్వం బోధ‌ప‌డిన‌ట్టుందే!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఎట్ట‌కేల‌కు ప్ర‌జ‌ల విష‌యంలో త‌త్వం బోధ‌ప‌డిన‌ట్టుగా క‌నిపిస్తోంద‌న్న టాక్ వినిపిస్తోంది. తాజాగా విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న గ‌తానికి భిన్నంగా.. కాన్వాయ్ దిగి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు నేరుగా న‌డుచుకుంటూ వెళ్లారు. త‌న కోసం వేచి ఉన్న‌వారి నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. అంతేకాదు.. వారిని అక్క‌డే ఓదార్చే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ఓపిక‌గా.. ఓర్పుగా కూడా ఆల‌కించారు. గ‌తంలో ఈ ప‌రిస్థితి లేద‌న్న విష‌యం తెలిసిందే.

ఐదేళ్లు అధికారంలో ఉన్న‌ప్పుడు ఎవ‌రైనా విజ్ఞాప‌న‌లు ఇచ్చేందుకు వ‌స్తే.. వారంతా టీడీపీ వారు అని ముద్ర వేసిన జ‌గ‌న్‌.. క‌నీసం వారి నుంచి విన్న‌పాలు తీసుకునేందుకు కూడా ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. వాస్తవానికి ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ద్య‌కు వ‌చ్చిందే త‌క్కువ‌. వ‌చ్చిన స‌మ‌యంలో ఎవ‌రైనా ఫిర్యాదు చేసుకునేందుకు.. త‌మ స‌మ‌స్య చెప్పుకొనేందుకు అవ‌కాశం ఇవ్వ‌లేదు. పైగా.. వారంతా ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసేందుకు టీడీపీ పంపిస్తే వ‌చ్చార‌ని.. వ్యాఖ్యానించిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.

అంతేకాదు.. ఇన్ని సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నాం.. ఇంకా స‌మ‌స్య‌లు ఎక్క‌డ ఉంటాయి? అని ఒక సంద‌ర్భంలో అసెంబ్లీలోనే జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. అయితే.. ఎన్ని సంక్షేమ ప‌థ‌కాలు అమలు చేసినా.. ఎన్న వేల రూపాయ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు ఇచ్చినా.. ఎక్క‌డో ఏదో ఒక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న కుటుంబాలు ల‌క్ష‌ల్లోనే ఉన్నాయి. ఇప్ప‌టికీ.. కూట‌మి ప్ర‌భుత్వం ఇన్ని చేశాం.. అన్ని చేశాం.. అని చెబుతున్నా.. స‌మ‌స్య‌లు చెప్పుకొనే వారు బారులు తీరుతూనే ఉన్నారు. వారికి కావాల్సింది ఓదార్పు. చిన్న ప‌రిష్కారం.

ఈ విష‌యంలో గ‌తంలో జ‌గ‌న్ అవ‌లంభించిన విధానం ఆయ‌న‌కు మైన‌స్ అయింది. ఫ‌లితంగా తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. తాజాగా ఈ విష‌యంలో త‌త్వం బోధ‌ప‌డిన‌ట్టుగా ఆయ‌న త‌నను తాను ప్ర‌జ‌ల‌కు చేరువ చేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. అందుకే.. విశాఖ ప‌ర్య‌ట‌న‌ల‌తో నేరుగా కాన్వాయ్ దిగి మ‌రీ ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేలా వ్య‌వ‌హ‌రించారు. వారి స‌మ‌స్య‌లు విన్నారు. అర్జీలు కూడా తీసుకున్నారు. ఏదేమైనా.. అధికారంలో ఉన్న‌ప్పుడే ఇలా వ్య‌వ‌హ‌రించి ఉంటే.. ఈ ప‌రిస్థితివ‌చ్చేది కాద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.