బూజు పట్టిన, ప్రజలకు పనికిరాని రూల్స్ను బుట్టదాఖలు చేయాలని సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా అవసరం లేని బిజినెస్ రూల్స్ను సంస్కరించుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ రీ డ్రాఫ్ట్(తిరిగి రాయడం) చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి సంస్కరణలు తీసుకురావాలని నిర్దేశించారు. సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌరసేవలు, రాష్ట్రంలో యూరియా లభ్యతపై ముఖ్యమంత్రి సమీక్షించారు.
దేవదాయ, రహదారులు భవనాలు, ఏపీఎస్ఆర్టీసీ, రవాణా, అగ్నిమాపక, వ్యవసాయ శాఖలు అందిస్తున్న వివిధ సేవలు, ప్రజల నుంచి వ్యక్తం అవుతున్న సంతృప్త స్థాయిపై సీఎం సూచనలు జారీ చేశారు. ప్రోయాక్టివ్ గవర్నెన్సు(ఉత్సాహ పూరిత పాలన) అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారులు సరైన నాయకత్వం అందిస్తేనే చిట్టచివరి వ్యక్తి వరకూ పాలనా ఫలితాలు అందుతాయని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో మెరుగైన ఫలితాలు అందేలా నిర్ణయాలు ఉండాలని సీఎం సూచించారు.
ప్రసాదాల్లో నాణ్యత..
దేవదాయశాఖలో ప్రసాదాల నాణ్యతతో పాటు ఆధ్యాత్మికతను మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని 21 ప్రముఖ దేవాలయాల్లో విస్తృతమైన పొటెన్షియల్ ఉందని .. సరైన ప్రణాళిక ద్వారా వీటిని గ్రోత్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని సూచనలు ఇచ్చారు. ఈ దేవాలయాలను ఆనుకుని ఆర్ధిక కార్యకలాపాలు విస్తృతంగా పెరగాలన్నారు. పర్యాటక కార్యకలాపాలు పెరిగేందుకు కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇక నుంచి అన్ని ఫిర్యాదులకు సంబంధించి క్రౌడ్ సోర్సింగ్ ద్వారా సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సమస్యలు సాధారణం కాదు
సమస్యలతో వచ్చే ప్రతీ అర్జీదారుకు తగిన సమాధానం కూడా ఇవ్వాలని సీఎం సూచించారు. వాటిని లైట్ తీసుకోవద్దని ఆయన సూచించారు. అగ్నిమాపక శాఖలో సేవల ప్రమాణాల్ని పెంచాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో యూరియా సరఫరాపై రైతు సంఘాలు, ఆర్ఎస్కేల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని… యూరియా దుర్వినియోగం కాకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, అధికారులు తప్పు చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని బస్టాండ్లలోనూ ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపర్చాలన్నారు.
వైసీపీ పాలన తరహా వద్దు
గత వైసీపీ పాలనలో రాజకీయ కక్షతో కొందరి భూముల్ని 22ఏ కింద పెట్టి వివాదంలోకి నెట్టారన్నారు. ఇప్పటికి 27 లక్షల మందికి పట్టాదారు పాసుపుస్తకాలు అందించామని, ఇంకా 72 లక్షల మందికి జారీ చేయాల్సి ఉందన్నారు. శెట్టిపల్లి భూ వివాదాన్ని పరిష్కరించటం ద్వారా రైతుల సమస్యలు తీరటంతో పాటు 900 కోట్ల విలువైన భూమి ప్రభుత్వానికి వచ్చిందన్నారు. ఇలాంటి అవకాశాలనే అన్ లాక్ చేయాల్సి ఉందని సీఎం అధికారులకు సూచించారు. పీజీఆర్ఎస్తో పాటు వివిధ రకాలుగా వచ్చే ప్రతీ అర్జీ, ఫిర్యాదునూ మానవతా కోణంతో పరిష్కరించాలని సీఎం సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates