ముద్రగడ పద్మనాభం కన్నుమూత

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ రోజు సాయంత్రం ఆయన మృత్యు ఒడికి చేశారు.

2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ముద్రగడ కొంతకాలం పాటు ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన గతంలో ఉద్యమాలు చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన దశాబ్దాలుగా ఉద్యమాలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా, కాకినాడ మాజీ ఎంపీగా పనిచేశారాయన.

రాజకీయ సవాళ్ల నేపథ్యంలో పేరు మార్చుకున్న సీనియర్నేతగా ఆయన గుర్తింపు పొందారు. సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం.. జనసేనాని పవన్ కళ్యాణ్ పై చేసిన సవాల్ మేరకు తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు.

పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పవన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని శపథం చేసిన ఆయన, 2024 జూన్ 20న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక గెజిట్ విడుదల చేయడంతో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన సమీప ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు.

కొంతకాలంలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను వైసీపీ నాయకులు పరామర్శించలేదని, ముద్రగడను వాడుకుని వదిలేశారని ఆయన కుమార్తె క్రాంతి ఆరోపించారు. ఆమె ఇప్పుడు జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. తండ్రీ కూతురు వేర్వేరు పార్టీలలో ఉండడం విశేషం. కిడ్నీ, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ముద్రగడ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని నేతలు ఆయన మరణానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.