రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆయన పదవీ విరమణ చేశారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలపై పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గతంలో కూటమి ప్రభుత్వానికి సూచనలు చేసిన సందర్భాల్లోనూ ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు.
తాజాగా ఉపా చట్టం (యూఏపీఏ) వినియోగంపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన ఏబీవీ, ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదికను పంచుకోవడంపై వస్తున్న విమర్శలకు స్పందించారు. ఆ వేదికపై అంబటి రాంబాబు ఏమి మాట్లాడారో తాను వినలేదని, ఆయన పక్కన కూర్చున్నాననే కారణంతో సభ మధ్యలో లేచి వెళ్లిపోవడం సభా మర్యాద కాదని చెప్పారు.
“మీ అందరితో హీరో అనిపించుకోవడం కోసం నేను సంస్కారం వదిలేయాలా? మీరు నా గురించి పొరబడ్డారు. నేనలాంటి వాడిని కాదు” అంటూ ఏబీవీ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. గతంలో జగన్ ప్రభుత్వం మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వలేదని, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరించాలనుకుంటుందా? అని ప్రశ్నించారు.
ఇంతకుముందు అమరావతి భూసేకరణ అంశంపైనా ఏబీవీ స్పందించారు. రెండో విడతలో వేలాది ఎకరాల భూమిని సేకరించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులు రోడ్డెక్కే పరిస్థితి వస్తే ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం కష్టమవుతుందని హెచ్చరించారు. అలాగే అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేయకపోతే కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్టేనని వ్యాఖ్యానించారు.
అలాగే జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ అంశాన్ని కూడా తేలికగా తీసుకోవద్దని సూచించారు. యూట్యూబ్ వ్యాఖ్యలపై ఉపా చట్టాన్ని ప్రయోగించే విషయంలో రాజద్రోహం కేసు అవసరం లేదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో కూటమి కార్యకర్తల నుంచి విమర్శలు రావడంతో, తాను చేస్తున్న వ్యాఖ్యలను సద్విమర్శలుగా స్వీకరించాలని ఏబీవీ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వరుస పోస్టులు చేస్తూ తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates