వ‌ర్క్ ఫ్రం హోం బాధ త‌ప్పుతుంద‌ట‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి లాక్ డౌన్ నాటి నుంచి ఇప్పటి దాకా సాఫ్ట్‌వేర్‌ సంస్థల కార్యకలాపాలు ఉద్యోగుల ఇళ్ల నుంచే జరిగాయి.

అయితే లాక్‌డౌన్‌ను దశలవారీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొడగిస్తుండడంతో ఈ సంస్థలు భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. దీంతో ఉద్యోగుల‌ను కార్యాల‌యాల నుంచే ప‌ని చేయించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు షెడ్యూల్ ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది.

క‌రోనా విస్త‌ర‌ణ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో మూడో విడత లాక్‌డౌన్ను ఈ నెల 17వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కరోనా ప్రభావమున్న ప్రాంతాలను గ్రీన్‌, రెడ్‌, ఆరెంజ్‌ జోన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. రెడ్‌జోన్లలో ఆంక్షలు విధించి, ఇత‌ర జోన్లలో ఉంటున్నవారు బయటకు రాకుండా కట్టడి చేస్తోంది.

రెడ్‌జోన్‌ కాకుండా మిగతా జోన్లలో ఉంటున్న ఉద్యోగులను పరిమిత సంఖ్యలో విధులకు హాజరయ్యేలా సాఫ్ట్‌వేర్‌ సంస్థల యాజమాన్యాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి పాక్షికంగా తమ కార్యాలయాల కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కొంతమంది ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయిస్తూనే మరికొంతమందిని కార్యాలయాలకు రావాలని ఆయా సంస్థల యాజమాన్యాల ఉద్యోగులకు ఈ-మెయిల్‌, వాట్సాప్‌ సమాచారాన్ని పంపించినట్లు సమాచారం.

హైదరాబాద్‌లోని ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ఉద్యోగులు అక్కడున్న వైరస్‌ ప్రభావాన్నిబట్టి విధులకు వచ్చేలా చూడాలని భావిస్తోంది. ఉద్యోగులు ఉంటున్న ప్రాంతం, జోన్లను బట్టి వారికి యాజమాన్యం రవాణా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. కార్యాలయాలు తిరిగి తెరుచుకున్నాక కూడా కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి భౌతిక దూరాన్ని పాటించి విధులు నిర్వహించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి మాస్కుధరించి రావాలని, ప్రతీ కార్యాలయంలో శానిటైజర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గతంలోలాగా రోజూ మూడు షిఫ్ట్‌లు కాకుండా కార్యాలయాలకు వచ్చే వారిని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసేలా చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంలోని ఐటీశాఖ నుంచి అనుమతి పొందినట్లు చెబుతున్నారు.