మాటిచ్చిన మరుసటి రోజే… హామీని నెరవేర్చిన పవన్

హస్తకళా మహోత్సవం వేదికపై కళాకారులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను స్వయంగా విన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరుసటి రోజే క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ప్రారంభించారు. రెండు రోజులు గడవక ముందే ఆయన తన హామీని నిలబెట్టుకున్నారు.

ముఖ్యంగా లేస్ కళాకారుల్లో కంటి సమస్యలు ఎక్కువగా ఉండటం, కలంకారీ కళాకారుల్లో కూడా ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించడం వల్ల ప్రతి కళకు ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయనే విషయాన్ని గుర్తించారు. నరసాపురంలో 105 మంది కళాకారుల్లో 37 మందికి కంటి సమస్యలు, వారిలో 16 మందికి శుక్లాలు గుర్తించడం ఈ రంగంలో ఆరోగ్య పరిరక్షణ ఎంత అవసరమో స్పష్టం చేస్తోంది.

సమస్య చెప్పిన మహాలక్ష్మి, అందే లక్ష్మి అనే ఇద్దరు కళాకారిణులను మరుసటి రోజే శంకర నేత్రాలయకు తరలించి పరీక్షలు చేయించడం విశేషం. హస్తకళల పరిరక్షణ అంటే కేవలం కళాకృతులకు మార్కెట్ కల్పించడం మాత్రమే కాదు. ఆ కళను సృష్టించే కళాకారుడి ఆరోగ్యం, జీవనోపాధి, సామాజిక భద్రతను కూడా కాపాడాలి అనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం. ఈ క్రమంలోనే బుధవారం నరసాపురం లేస్ కళాకారులు, శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు.

నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించగా, 37 మందికి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్టు నిర్ధారించారు. అందులో 16 మందికి కళ్లలో శుక్లాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అవసరం అయిన వారికి వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో శస్త్ర చికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి దోష సమస్యలు ఉన్న 21 మందికి కళ్ల జోళ్లు వేయించే ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తిలో మొత్తం 53 మంది హస్తకళాకారులకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక పరీక్షలతో పాటు అన్ని రకాల ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తమీద పవన్ కళ్యాణ్ మాట ఇచ్చిన మరుసటి రోజే హామీలు నిలబెట్టుకోవడం ప్రశంసలను అందుకుంటుంది.