ఏపీ ప్రతిపక్షం వైసీపీలో నాయకుల మధ్య కలివిడి ఎలా ఉన్నా.. వివాదాలకు మాత్రం కేంద్రంగా మారుతున్నారు. ఒకరిపై ఒకరికి పడడం లేదు. ఇది తీవ్ర విమర్శలకు, వివాదాలకు కారణమవుతూ.. పార్టీ పరువు ను కూడా రోడ్డున పడేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా చిన్న విషయానికే మహిళా నాయకులకు, పురుష నాయకులకు మధ్య వివాదం ఏర్పడి.. ఏకంగా కొట్టుకునే వరకు పరిస్థితి ఏర్పడింది. మహిళలను పురుషులు.. వారిని మహిళల బంధువులు కూడా కొట్టడంతో ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
ఏం జరిగింది..?
జూలై 8, బుధవారం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. దీనిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాల్లో కార్యక్రమాలు చేపట్టారు. ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమానికి భారీగానే కార్యకర్తలు, నాయకులు వచ్చారు. ఈ క్రమంలో కొందరు మహిళా నాయకుల రాకపై పురుష నేతలు కామెంట్లు చేశారు. “పార్టీ కార్యక్రమాలకు రమ్మంటే రారు కానీ.. “ అంటూ వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. దీంతోపాటు.. మహిళా నాయకులను తోసుకుంటూ కొందరు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు.
ఓ మహిళా నాయకురాలిని వెనకనుంచి ఓ యువ నాయకుడు తోయడం.. ఆమె తూలి పడిపోయే ప్రయత్నంలో తనను తాను నిగ్రహించుకున్న దరిమిలా.. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది పెనుదు మారంగా మారి.. మహిళా నాయకురాలిని మెట్లపై నుంచి యువ నాయకుడు తోసేశాడు. ఇదే మని ప్రశ్నిం చిన మరో ఇద్దరు మహిళలతోనూ వివాదానికి దిగాడు. ఇలా ప్రారంభమైన రచ్చ.. ఇరు పక్షాల మధ్య తీవ్ర వ్యాఖ్యలు.. తోపులాటలతో అట్టుడికింది. చివరకు పార్టీ ఇంచార్జ్ హెచ్చరించడంతో సర్దుమణిగింది.
కాగా.. పార్టీలో మహిళలకు విలువ ఉంటుందని జగన్ చెబుతున్నారని.. కానీ, క్షేత్రస్థాయి నాయకులు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మహిళా నాయకులు విమర్శించారు. మహిళలకు విలువ లేని పార్టీలో ఉండలేమని ఒకరిద్దరు చెప్పారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్టు పురుష నేతలు పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates