మహిళా మంత్రి గారు మళ్ళీ అలిగారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయ‌కురాలు, ప్ర‌స్తుత మంత్రి కొండా సురేఖ మ‌ళ్లీ అలిగారా? కీల‌క‌మైన మంత్రి వ‌ర్గ స‌మావేశానికి గైర్హాజ‌య్యారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. మంత్రి వ‌ర్గంలో దేవదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ‌.. గ‌త ఏడాది కాలంగా అసంతృప్తితోనే ఉన్నారు. త‌న‌కు ప్రాధాన్యం లేద‌ని.. త‌నను హైజాక్ చేస్తున్నార‌ని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యానికి తోడు.. న‌టుడు నాగార్జున విష‌యంలో ఏర్ప‌డిన వివాదంపై తాను ఒంటరిన‌య్యాన్న ఆవేద‌న కూడా ఆమెలో ఉంది.

దీంతో ప్ర‌భుత్వానికి-మంత్రికి మ‌ధ్య గ్యాప్ కొన‌సాగుతోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఇదిలా వుంటే.. తాజాగా గురువారం కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించారు. దీనిలో ఫ్యూచ‌ర్ సిటీ స‌హా.. కీల‌క ప్ర‌తి పాద‌న‌ల‌కు ఆమోదం తెలిపారు. అంతేకాదు.. తొలిసారి పేప‌ర్ ర‌హిత మంత్రివ‌ర్గ స‌మావేశంగా కూడా దీనిని నిర్వ‌హించారు. మ‌రోవైపు.. బీఆర్ ఎస్‌కు, మంత్రుల‌కు మ‌ధ్య వివాదం కూడా ఇదే రోజు చోటు చేసుకుంది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో మంత్రివ‌ర్గ స‌మావేశానికి ప్రాధాన్యం ఏర్ప‌డింది.

అయితే.. ఇత‌ర మంత్రులు రాజ‌కీయ స‌వాళ్ల వ్య‌వ‌హారంలో ఉండ‌గా.. కొండా సురేఖ మాత్రం ఇంటి ప‌ట్టునే ఉండి కూడా ఈ భేటీకి గైర్హాజ‌రు కావ‌డంతో రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది. క్యాబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి.. సురేఖ విష‌యం ఆరా తీశార‌ని స‌మాచారం. అంతేకాదు.. ఫోన్ చేసినా స్పందించ‌లేద‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. దీంతో సురేఖ మంత్రివ‌ర్గ స‌మావేశానికి హాజ‌రు కాక‌పోవ‌డంపై సీఎం సైతం విస్మ‌యం వ్య‌క్తం చేశార‌ని తెలిసింది.

తాజా కార‌ణం ఇదేనా?

మంత్రి సురేఖ క్యాబినెట్ భేటీకి రాక‌పోవ‌డం వెనుక‌.. రెండు రోజుల కింద‌ట స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యమే కార‌ణ‌మ‌ని అంటున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద దేవాల‌యంగా ఉన్న యాద‌గిరి ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి ఆల‌య‌.. పాల‌క‌మండ‌లి బోర్డును ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. అయితే.. దీనిలో త‌న కుమార్తెకు చోటు క‌ల్పించాల‌ని సురేఖ కోరిన‌ట్టు స‌మాచారం.

అదేస‌మ‌యంలో త‌ను సూచించిన వారిని కూడా చేర్చాల‌ని ఆమె కోరార‌ని తెలిసింది. కానీ, స‌ర్కారు ఈ విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టి.. బోర్డు ప్ర‌క‌టించింది. పైగా ఈ బోర్డులో చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ‌ను చేర్చిన విష‌యం కూడా మంత్రి సురేఖ‌కు తెలియ‌ద‌ని అంటున్నారు. అందుకే ఆమె ఇంట్లోనే ఉండి కూడా.. మంత్రివ‌ర్గ స‌మావేశానికి రాలేద‌న్న చ‌ర్చ కాంగ్రెస్ వ‌ర్గాల్లోనే జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.