బొత్స ఇలాకాలో మంత్రి పాగా… వైసీపీ ఖాళీ!

ఏపీలో చేరిక‌ల ప‌ర్వం ప్రారంభమైంది. ఎన్నిక‌ల‌కు ముందుగానే వైసీపీని ఖాళీ చేసే దిశగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయ‌కులు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను చేప‌ట్టారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా వైసీపీ కేడ‌ర్‌ను పార్టీలో చేర్చుకునే కార్య‌క్ర‌మాన్ని ముమ్మ‌రంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని గ‌జ‌ప‌తి న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే క‌మ్ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌.. వైసీపీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను భారీ సంఖ్య‌లో సైకిల్ ఎక్కించారు.

గ‌జ‌ప‌తి న‌గ‌రం అంటేనే వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణకు, ఆయ‌న కుటుంబానికి కూడా కంచుకోట‌. వాస్త‌వానికి చీపురుప‌ల్లిపై ఎంత ప‌ట్టు ఉందో .. గ‌జ‌ప‌తి న‌గరం పైనా అంతే ప‌ట్టుంది. బొత్స సోద‌రుడు అప్ప‌ల‌న‌ర‌స‌య్య గ‌తంలో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. 2024 ఎన్నికల్లో ఇక్క‌డ నుంచి కొండ‌ప‌ల్లి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఉన్న‌త విద్యావంతుడు కావ‌డంతో చంద్ర‌బాబు ఆయ‌న‌కు మంత్రి పీఠం ఇచ్చారు. ఆ త‌ర్వాత‌.. త‌న‌దైన ప‌నితీరుతో చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మంచి మార్కులు కూడా సంపాయించుకున్నారు. ఇటీవ‌ల చేరిక‌ల‌కు చంద్ర‌బాబు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో మంత్రి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీపై దృష్టి పెట్టారు.

కూట‌మి పాల‌న‌, టీడీపీ నేతల శైలికి ఫిదా అయిన‌.. వైసీపీ త‌ర‌ఫున ఇప్ప‌టి వ‌ర‌కు ప‌నిచేసిన 300 కుటుంబాల‌ను టీడీపీలో చేర్చుకున్నారు. ఇది పార్టీ ప‌రంగా వైసీపీకి ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుంద‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. మాజీ మంత్రిగా సీనియ‌ర్ నాయ‌కుడిగా బొత్స స‌త్య‌నారాయ‌ణకు ఇది భారీ ఎఫెక్ట్‌గా మార‌నుందని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న స‌తీమ‌ణి ఝాన్సీని ఇక్క‌డ నుంచి పోటీ చేయించాలని బొత్స భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వైసీపీ ఖాళీ కావ‌డం గ‌మ‌నార్హం.

వైసీపీ నుంచి వ‌చ్చి టీడీపీలో చేరిన వారిలో గజపతినగరం వైస్ ఎంపీపీ కర్రి శ్రీదేవి, మాజీ సర్పంచ్ నరవ ఆదిలక్ష్మితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు ఉన్న‌వారు. వీరంతా నిన్న మొన్న‌టి వ‌ర‌కు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు అనుకూలంగా ఉన్నారు. బొత్స సోద‌రుడి వ‌ర్గంగా కూడా చ‌లామ‌ణి అయ్యారు. ఇప్పుడు అనూహ్యంగా వారంతా సైకిల్ ఎక్కేయ‌డం గ‌మ‌నార్హం. కాగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న కూటమి పాలనను చూసి ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు సాగుతున్నాయని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు.