ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఉన్న జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జొన్నగిరి ప్రాంతానికి శతాబ్దాల నాటి చరిత్ర ఉందని తెలిపారు. ఘనమైన వారసత్వ సంస్కృతి, సంప్రదాయాలను చరిత్రను పరిరక్షిస్తున్నామన్నారు.
అశోక చక్రవర్తి కాలంలో ఈ ప్రాంతం నాలుగో రాజధానిగా ఉండేదని.. అప్పట్లో సువర్ణగిరిగా ఈ ప్రాంతాన్ని పిలిచిన విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఇదే తరహాలో రాయలసీయను అభివృద్ధి చేసేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సీమకు కీలకమైన ప్రాజెక్టులను తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని తెలిపారు. సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తద్వారా వలసలు నివారించి.. ఇక్కడివారికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.
జొన్నగిరిలో ఏడాదికి టన్ను బంగారం లభిస్తుందని చంద్రబాబు చెప్పారు. అయితే.. ప్రస్తుతం 400 కిలోల వెలికితీతకు ప్రారంభోత్సవం చేశామని.. భవిష్యత్తులో వెయ్యి కిలోల బంగారం వెలికితీత శుద్ధికి ప్రాధాన్యం పెరుగుతుందని చెప్పారు. జొన్నగిరిలో ఇప్పటికే 800 ఉద్యోగాలు వచ్చాయన్న చంద్రబాబు.. త్వరలో 1500 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. జొన్నగిరి చిరునామా ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుతోందని తెలిపారు.
నగల తయారీ కూడా..
జొన్నగిరిలో నగల తయారీ కేంద్రం ఏర్పాటుకు కూడా కృషి చేస్తామన్నారు. పెట్టుబడులు పెట్టేవారికి.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా.. అన్ని వనరులను సమకూరుస్తున్నామన్నారు. పెట్టుబడులకు ఏపీ చిరునామాగా మారిందన్నారు. కర్నూలుకు త్వరలోనే ఏపీ హైకోర్టు బెంచ్ రానుందని వివరించారు. అలాగే.. రాయలసీమ స్టీల్ ప్లాంటు(కడప)ను కూడా 2028నాటికి పూర్తి చేస్తామన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates