సాయికృష్ణది లాకప్ డెత్… తేల్చిన సిట్

విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే ఈ రోజు సిట్ అధికారులు సమర్పించిన రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సాయికృష్ణ లాకప్ డెత్ వాస్తవమేనని సిట్ అధికారులు ప్రాథమికంగా ధృవీకరించి కోర్టుకు నివేదిక సమర్పించడం సంచలనం రేపుతోంది. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజు మాయం చేశారని తమ నివేదికలో సిట్ అధఇకారులు వెల్లడించారు.

కస్టడీలో తగిలిన గాయాల వల్లే సాయికృష్ణ మృతిచెందాడని, సీసీటీవీ ఫుటేజీని ఉద్దేశ్యపూర్వకంగానే డిలీట్ చేశారని అధికారులు తేల్చారు. మే 6వ తేదీన సాయికృష్ణను మార్కాపురం నుంచి కృష్ణలంకకు తెచ్చారని, అయితే, కస్టడీకి అప్పగించిన తర్వాత అతడి ఆచూకీ దొరకలేదని తెలిపారు. చట్టవిరుద్ధంగా అతడిని కస్టడీలో ఉంచారని చెప్పారు. సాయికృష్ణను మే 6-8 తేదీల్లో స్టేషన్ లో చూశానని ఎస్ ఐ చెప్పారని తెలిపారు. అంతేకాదు, స్టేషన్లో సాయికృష్ణను అపస్మారక స్థితిలో అతడి తల్లి చూశారని వెల్లడించారు.

సాయికృష్ణ మృతదేహాన్ని పూడ్చేందుకు లేదా తగులబెట్టేందుకు సీఐ నాగరాజు విశ్వప్రయత్నాలు చేశారని అధికారులు తమ నివేదికలో వెల్లడించారు. అయితే, సాయికృష్ణ మృతదేహం ఇంకా లభించలేదని తమ నివేదికలో పేర్కొన్నారు. డెడ్ బాడీని ఏం చేశారు అనే విషయంపై లోతైన దర్యాప్తు చేయాల్సి ఉందన్నారను. దర్యాప్తునకు నాగరాజు సహకరించడం లేదని, తప్పుడు సమాచారంతో కేసును పక్కదోవ పట్టించేందుకు చూస్తున్నారని తెలిపారు.