గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది గద్దర్ అని స్పష్టమవుతుంది. మరో వ్యక్తి బహుజన ఉద్యమకారుడు అగస్టిన్ అని పవన్ తెలిపారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పాత ఫొటోపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ ఫొటో తనకు తెలంగాణ ఉద్యమం, సామాజిక తెలంగాణ ఆలోచనల చుట్టూ సాగిన ఎన్నో చర్చలను గుర్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆయన సమావేశం ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడి నుంచి పవన్ మాటల్లో, చేతల్లో తెలంగాణపై తనకున్న అనుబంధాన్ని చూపిస్తున్నారు. రాష్ట్ర విభజన, తెలంగాణ ఉద్యమం వంటి పలు అంశాలపై మాట్లాడుతున్నారు. తెలంగాణలో జనసేన కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. దీన్నిబట్టి అక్కడి రాజకీయాలపై కూడా ఆయన ఫోకస్ చేసినట్లు అర్థమవుతోంది.

ఈ క్రమంలోనే ఆయన ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో బహుజన భావజాలం, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల రాజకీయ సాధికారత వంటి అంశాలపై తరచూ చర్చలు జరిగేవని గుర్తు చేశారు. తెలంగాణ మేధావులు, బహుజన ఉద్యమకారుడు అగస్టిన్, ప్రజా గాయకుడు గద్దర్ తదితరులతో కలిసి తెలంగాణ భవిష్యత్తు, రాజకీయ అధికార వికేంద్రీకరణ, సామాజిక తెలంగాణ నిర్మాణం వంటి అంశాలపై లోతైన చర్చలు సాగేవని అన్నారు.

తన తండ్రి వెంకటరావు మరణానంతరం అగస్టిన్, గద్దర్ తమ నివాసానికి వచ్చిన సందర్భంలో ఈ ఫొటో తీసినట్లు తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావానికి ముందున్న కాలానికి చెందిన ఈ ఫొటో తన జీవితంలో ఒక ప్రత్యేక జ్ఞాపకమని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సామాజిక మార్పు, సమానత్వం, సామాజిక న్యాయానికి రాజకీయ రూపం ఇవ్వాలన్న ఆకాంక్షలతో నిండిన ఆ రోజుల చర్చలు ఇప్పటికీ తనకు స్ఫూర్తినిస్తాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సామాజిక న్యాయం రాజకీయ సాధికారతగా మారాలన్న లక్ష్యంతో జరిగిన ఆ ఆలోచనా వేదికలు తన మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు.