పీకే… సినిమాల వరకు ఓకే: కవిత

జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే హైదరాబాద్ లో జనసేన కార్యాలయాన్ని ప్రారంభించారు పవన్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆల్రెడీ తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, జనసేన కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత కూడా మరోసారి పవన్ పై వారు తమ వ్యాఖ్యలకు పదునుపెట్టారు. ఈ నేపథ్యంలోనే పవన్ పై టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

వాళ్లు సినిమా యాక్టర్ల ముసుగులో వస్తారని, ఆ తర్వాత రాష్ట్రాన్ని కబ్జా చేస్తారని ఆంధ్రా నటులను, పరోక్షంగా పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటి పవన్ అభిమానులు అప్పటికి పుట్టలేదని చెప్పారు. నటుల ముసుగులో వచ్చి తెలంగాణ భాష, యాస బాగోలేదని కించపరుస్తారని, నా పేరు యాదగిరి, ఊరు భువనగిరి, చేసేది దాదాగిరి… అంటూ తెలంగాణ ప్రాంతాలు, ప్రజలను అవమానించేలా డైలాగులు రాసేవారని గుర్తు చేశారు.

ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాతే తెలంగాణ భాషను హీరోలు మాట్లాడడం మొదలుబెట్టారని అన్నారు. అయితే, పవన్ సినిమాలకు వెళ్లి ఆయన నటన, డ్యాన్సులు ఎంజాయ్ చేయొచ్చని అన్నారు. తెలంగాణకు పవన్ రావచ్చని, పోవచ్చని, సినిమాలు తీసుకోవచ్చని, రిలీజ్ చేసుకోవచ్చని కవిత అన్నారు. ఆ సినిమాలు తాము చూసి పవన్ వేసే స్టెప్పులకు తాము కూడా చప్పట్లు కొడతామని చెప్పారు. నైజాంలో సినిమాలకు మిగతా ప్రాంతాల కన్నా ఎక్కువ కలెక్షన్లు వస్తాయని, బేసికల్లీ సినిమా ఇండస్ట్రీ బ్రతికేదే తెలంగాణ ప్రజలతో అని కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.