కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో రెండేళ్ల స‌మ‌యం మాత్ర‌మే ఉంటుంది. ఆ త‌ర్వాత‌.. ఏడాది అంటే.. ఎన్నిక‌ల‌కు ముందు సంవ‌త్స‌రం పూర్తిగా ఎన్నిక‌ల రాజ‌కీయాలు ప్రారంభం అవుతాయి. ఈ నేప‌థ్యంలో స‌ర్కారు వేసే అడుగులు.. తీసుకునే నిర్ణ‌యాల‌కు.. వ‌చ్చే రెండేళ్ల కాలం అత్యంత కీల‌క‌మ‌ని అంటున్నా రు ప‌రిశీల‌కులు.

రెండేళ్ల పాల‌న‌లో..

గ‌డిచిన రెండేళ్ల పాల‌న‌లో సంక్షేమం విష‌యంలో కూట‌మికి మంచి మార్కులే ప‌డ్డాయి. ప్ర‌జ‌ల సంతృప్తి కూడా.. 80 శాతం మేర‌కు ఉంద‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. దీనిని 98 శాతానికి చేర్చా ల‌న్న‌ది ఆయ‌న ఉద్దేశం. ప్ర‌తి నెలా 1నే ఇంటికి పింఛ‌న్లు అందిస్తున్న తీరు స‌ర్కారుకు మంచి టాక్ వ‌చ్చేలా చేసింది. ఇక‌, పెట్టుబ‌డుల‌పై ప్ర‌ధానంగా పెట్టిన దృష్టి.. త‌ద్వారా ల‌భించే ఉపాధి, ఉద్యోగాలు వంటివి కూడా.. సర్కారుకు మేలు చేశాయ‌నే చెప్పాయి.

అదేస‌మ‌యంలో దూర‌దృష్టి ఉన్న నాయ‌కుడిగా చంద్ర‌బాబుకు మంచి మార్కులు అలానే కొన‌సాగుతున్నాయి. రెండు సంవ‌త్స‌రాలు పూర్త‌యిన నేప‌థ్యంలో స‌హ‌జంగా ఉండే వ్య‌తిరేక‌త కంటే కూడా.. దాదాపు 50 శాతం త‌క్కువ‌గానే వ్య‌తిరేక ఉంద‌న్న అంచ‌నాలు రావ‌డానికి కార‌ణం.. చంద్ర‌బాబు దూర‌దృష్టి, ఆయ‌న ఉంటే రాష్ట్రం డెవ‌ల‌ప్ అవుతుంద‌న్న ఉద్దేశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీనికితోడు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ చ‌రిష్మా.. ఆయ‌న పాల‌న తీరును కూడా ప్ర‌జ‌లు నిశితంగా గ‌మ‌నిస్తున్నారు.

త‌ద్వారా.. గ‌డిచిన రెండేళ్ల కాలంలో ప్ర‌భుత్వానికి అన్ని వ‌ర్గాల నుంచి మంచి మార్కులే ప‌డ్డాయి. చిన్న చిన్న చికాకులు ఎప్పుడూ ఉండేవే. ఏ ప్ర‌భుత్వం ఉన్నా.. సాగేవే. అయితే.. వీటిని కూడా చాక‌చ‌క్యంగా ప‌రిష్క‌రించ‌డంలో చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. ఇదిలావుంటే.. వ‌చ్చే మూడు సంవ‌త్స‌రాల్లో అమ‌లు చేయాల్సిన కార్య‌క్ర‌మాలు, గ్రౌండ్ చేయాల్సిన పెట్టుబ‌డులు త‌ద్వారా వ‌చ్చే ఉపాధి.. ఉద్యోగాలు వంటివాటిపై ప్ర‌ధానంగా దృష్టి పెడితే.. స‌ర్కారుకు ఢోకా లేద‌ని అంటున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ప్ర‌క‌ట‌న‌లు.. పెట్టుబ‌డుల‌పై ఆధారాల‌ను మాత్ర‌మే చూపించారు. కానీ, ఇవి ఇంకా గ్రౌండ్ కాలేదు. వీటిని సాధ్య‌మైనంత వేగంగా తీసుకురావాలి. అలాగే.. రేష‌న్‌కార్డుల పంపిణీ.. పింఛ‌ను కోసం వేచి చూస్తున్న‌వారికి ఊర‌ట వంటివి క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక‌, కేంద్రంతో సంబంధాలు బ‌లంగానే కొన‌సాగుతున్న నేప‌థ్యంలో విభ‌జ‌న చ‌ట్టం మేర‌కు రావాల్సిన వాటిని కూడా తీసుకువ‌చ్చి.. వెనుక‌బ‌డిన జిల్లాల‌ను అభివృద్ది చేస్తే.. స‌ర్కారు ప‌రంగా పాల‌న ప‌రంగా కూట‌మికి తిరుగులేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.