తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఒక సాధారణ రైతుపై చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం జైలు పాలవగా, ఆయనకు శిక్ష పడే వరకు చెప్పులు ధరించనని శపథం చేసిన రైతు తన మొక్కు తీర్చుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. 2022 జనవరి 6న పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు. ఆ సందర్భంగా ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని గ్రామానికి చెందిన రైతు గుడిపూడి నరేంద్ర ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన బ్రహ్మనాయుడు చెప్పు తీసి రైతుపై దాడి చేయడానికి ప్రయత్నించిన ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
ఈ ఘటన అనంతరం రైతు నరేంద్రపైనే పోలీసులు కేసు నమోదు చేసి 11 రోజుల పాటు జైలుకు పంపారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన నరేంద్ర, తనను నలుగురిలో అవమానించిన ఎమ్మెల్యేకు శిక్ష పడే వరకు చెప్పులు ధరించబోనని తన ఇష్టదైవం వద్ద శపథం చేశాడు. అప్పటి నుంచి దాదాపు 40 నెలల పాటు ఆయన చెప్పులు లేకుండానే జీవనం సాగించాడు.
కాలక్రమేణా రాజకీయ పరిస్థితులు మారాయి. గత ఎన్నికల్లో బొల్లా బ్రహ్మనాయుడు ఓటమిపాలయ్యారు. అనంతరం తెలంగాణలో నమోదైన భూకబ్జా కేసులో ఆయన అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే జైలుకు వెళ్లడంతో తన శపథం నెరవేరిందని భావించిన రైతు నరేంద్ర ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వేల్పూరు గ్రామం నుంచి మన్నేపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు ఆయన పాదయాత్ర నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు. ఈ పాదయాత్రకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి సంఘీభావం తెలిపారు. రైతు నరేంద్ర శపథం, దానిని నెరవేర్చుకున్న తీరు స్థానికంగా చర్చనీయాంశమైంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates