మహానాడుకు ఎంఐఎంకు ఆహ్వానం

హెడ్డింగ్ చూసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జనవరి 6వ తేదీన చెన్నైలో జరగబోతున్న డీఎంకే మహానాడులో పాల్గొనాల్సిందిగా ఏఐఎంఐఎంకు ఆహ్వానం అందింది. బీహార్లో మంచి ఫలితాలు సాధించిన మజ్లిస్ పార్టీకి ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపు వస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 25 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎంఐఎం ఐదు నియోజకవర్గాల్లో గెలిచిన విషయం తెలిసిందే. అంతకుముందు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి రెండు నియోజకవర్గాల్లో గెలిచింది.

ఇందులో భాగంగా రానున్న మే లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పాల్గొనాలని డిసైడ్ అయ్యింది. కమలహాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యుం (ఎంఎన్ఎం)పార్టీతో ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఈమధ్యనే సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే. డెఫనెట్ గా రెండుపార్టీలు కలిసి పోటీ చేసే విషయంపైనే పొత్తు చర్చలు జరిగుంటాయని అందరు అంచనా వేస్తున్నారు. అయితే వాళ్ళిద్దరి భేటి విషయాలు మాత్రం బయటకురాలేదు.

ఇంతలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ నుండి అధికారికంగా ఎంఐంఎ అధ్యక్షుడు అసదుద్దీన్ కు ఆహ్వానం అందటం ఆశ్చర్యంగా ఉంది. ఇటు కమలహాసన్ అటు స్టాలిన్ లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే సందిగ్దం వస్తే కచ్చితంగా డీఎంకేను అసద్ ఎంచుకుంటారని ప్రచారం మొదలైంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి రావటం గ్యారెంటీ అనే ప్రచారం ఊపందుకుంటోంది. కాబట్టి అధికారంలోకి వచ్చే పార్టీతో పొత్తు పెట్టుకోవటానికే ఏపార్టీ అయినా సహజంగా మొగ్గు చూపుతుందనటంలో సందేహం లేదు.

కాబట్టి డీఎంకే నుండి వచ్చిన ఆహ్వానంతో అసద్ 6వ తేదీన చెన్నైకు చేరుకుంటారని సమాచారం. తర్వాత పొత్తులపై చర్చిస్తారట. కాకపోతే ఎన్నిసీట్లలో ఎంఐఎం పోటీ చేయటానికి స్టాలిన్ అంగీకరిస్తారనేదే ప్రధానం. ఎంఐఎం వర్గాల సమాచారం ప్రకారం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 25 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని అసద్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

మరి ఎంఐఎం అనుకుంటున్నట్లు అన్ని నియోజకవర్గాలను డీఎంకే వదులుకుంటుందా ? ఎందుకంటే పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ కు కూడా ఎన్నోకొన్ని సీట్లు వదులుకోవాల్సుంటుంది. కాంగ్రెస్ తో పొత్తును తెంచేసుకుని ఎంఐఎంతోనే పెట్టుకునేట్లయితే అప్పుడు 25 సీట్లు వదులుకునే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా తమిళనాడులో కూడా ఎంఐఎంకు డిమాండ్ పెరిగిపోతోందన్నది వాస్తవం. మరి బీహార్ ఎన్నికల్లో చూపిన ప్రభావాన్నే తమిళనాడులో కూడా ఎంఐఎం చూపగలుగుతుందా ?