టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. గడచిన మూడు, నాలుగు రోజులుగా ఈ వివాదం ఏపీలో పెను కలకలాన్నే రేపుతోంది. బుధవారం కూడా ఈ వివాదాన్ని మరింతగా పెద్దది చేసేలా అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్దుబాటు ధోరణిలో మాట్లాడటానికి బదులుగా ఆయన ఈ వివాదాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు అయితే బలంగానే వినిపిస్తున్నాయి.
టీడీపీ వర్సెస్ వైసీపీ యుద్ధం ఓ రేంజిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి విశాఖ పరిధిలో ఈ రెండు పార్టీల మధ్య ఓ రేంజిలో మాటల యుద్ధం జరుగుతున్న తీరు ఆసక్తి రేకెత్తించేదే. ఇదివరకే మంత్రిగా పనిచేసిన అమర్ నాథ్… తనను ఓ మహిళ, అది కూడా రాష్ట్ర హోం శాఖ మంత్రిగా కొనసాగుతున్న అనిత.. వాడు, వీడు అని సంబోధించడం ఏమిటని మరోమారు ప్రస్తావించారు.
అసలు ఈ వివాదం మొదలైందే ఈ వ్యాఖ్యలతోనే కదా అన్నది ఆయన వాదన. వివాదం ఎక్కడ మొదలైనా… మహిళ అని కూడా చూడకుండా అనితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబన్న ప్రశ్నలు బలంగానే వినిపిస్తున్నాయి.
అమర్ నాథ్ తరఫున టీడీపీకి చెందిన చాలా మంది మహిళా నేతలు రంగంలోకి దిగగా… అమర్ నాథ్ తరఫున వైసీపీకి చెందిన పలువురు మహిళా నేతలు బరిలోకి దిగారు. వెరసి ఈ వివాదంపై నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతూనే ఉన్నాయి. అసలు తప్పు ఎక్కడ జరిగిందన్న దానిని అలా పక్కనపెడితే… ఈ వివాదానికి ఇక్కడితోనైనా ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందన్న వాదన వినిపిస్తున్న సమయంలో బుధవారం మరోమారు మీడియా ముందుకు వచ్చిన అమర్ నాథ్… ఈ వ్యవహారంలో తాను అస్సలు తగ్గేదే లేదని సంచలన ప్రకటన చేశారు.
తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే..తానూ తిరిగి ఇదివరకు మాట్లాడిన మాటలనే అనాల్సి వస్తుందని ఆయన చెప్పడం గమనార్హం. వెరసి ఈ వివాదం ఎప్పటికి ముగుస్తుందన్నది ఇప్పుడప్పుడే చెప్పలేమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates