SIR పై జగన్ అవగాహన ఇంతేనా?

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఏదో జరిగిందని, కానీ, ఆధారాలు లేవని, ఓట్ల చోరీ, ఈవీఎంల వల్ల కూటమి గెలిచిందని పరోక్షంగా జగన్ చేసిన కామెంట్లు ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని విమర్శలు వచ్చాయి. ఆ కామెంట్లు చేసి రెండేళ్లు గడిచినా…జగన్ మారలేదు. తాజాగా ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలుకాబోతున్న నేపథ్యంలో ఓట్ల చోరీ రాగాన్ని మరోసారి జగన్ ఎత్తుకున్న వైనంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

అవును…మరోసారి జగన్ ఓట్ల చోరీ పాట పాడేందుకు రెడీ అయ్యారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై వైసీపీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తతతో ఉండాలని జగన్ పిలుపునిచ్చారు. ప్రతి ఓటునూ కాపాడుకోవాలని పార్టీ సీనియర్ నాయకులతో భేటీలో ఆదేశించారు. అంతేకాదు, అధికార దుర్వినియోగంతో బూత్ కు కనీసం 50 వైసీపీ ఓట్లను తొలగించేలా కుట్ర చేస్తున్నారని జగన్ ఆరోపించడం షాకింగ్ గా మారింది.

ఓట్లు తొలగించే తప్పుడు పనుల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని జగన్ చేసిన ఆరోపణలు విమర్శలపాలవుతున్నాయి. వైసీపీ కో ఆర్డినేటర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు ఆ ఓట్ల తొలగింపును అడ్డుకోవాలని కూడా జగన్ సెలవిచ్చారు. ఇక, ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటు తొలగించిన తర్వాత తిరిగి చేర్పించడం చాలా కష్టమని కూడా జగన్ అన్నారు.

ఈ నేపథ్యంలోనే జగన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది రాజ్యాంగబద్ధంగా నిర్ధిష్ట సమయానికి జరిగే ఓ ప్రక్రియ అని, దానిపై కూడా జగన్ అసత్య ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేసేందుకు నెల రోజుల గడువు కూడా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఈ లోపే జగన్ తొందరపడి ఎస్ఐఆర్ లో ఓట్లు తొలగిస్తారని నిరాధార ఆరోపణలు చేయడం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని విమర్శిస్తున్నారు.