స‌తుల ఇలాకాల్లో.. ప‌తుల రాజ‌కీయం.. !

రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది.. రెండేళ్ల కాలంలో వారి పనితీరు ఏ విధంగా సాగింది. వారి ద్వారా ఆయా పార్టీలకు జరిగిన మేలు ఎంత అనే విషయాలను పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమం స్థానికంగా చేస్తున సానుకూల కార్యక్రమాలు వంటి వాటికంటే కూడా పురుష ఎమ్మెల్యేలతో సమానంగా అంతకన్నా ఎక్కువగా ఒక్కొక్క నియోజకవర్గంలో మహిళ ఎమ్మెల్యేలు చేతులు త‌డ‌పాల్సిందేన‌ని ప‌ట్టుప‌డుతున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది.

అయినా వాస్తవాలను ఒప్పుకుని తీరాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆయా ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉందనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్యే భర్త తీవ్ర వ్యతిరేకత తీసుకువచ్చేలాగా వ్యవహరిస్తున్నారని వార్తలు తరచుగా మీడియాలోనే వస్తున్నాయి. తమకు సంబంధించి ఏదైనా వార్త ప్రచురిస్తే దానికి వివరణ కోరుతూ నోటీసులు ఇస్తూ మీడియానే భయభ్రాంతులను గురి చేసే స్థితికి ఎమ్మెల్యే భర్త దిగజారారన్న వార్తలు కూడా వస్తుండ‌డం విశేషం.

ఇక అమరావతి ప్రాంతానికి చెందిన ఒక జిల్లాలో మరో మహిళా ఎమ్మెల్యే భర్త సైతం ఇదే తరహాలో రాజకీయాలు చేస్తున్నారని వినిపిస్తోంది. అయితే చిత్రం ఏంటంటే దీనిని పార్టీ అధిష్టానం చూసి చూడనట్టు వదిలేస్తోంది. ఇది ఇప్పుడు బాగానే ఉంటుంది.. ఉండొచ్చు.. కానీ వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేసుకోవాలి. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓ మహిళ ఎమ్మెల్యే భర్త సైతం అన్ని తానే అయి వ్యవహరిస్తున్నారు. ఏం జరిగినా తనకు తెలియాలి.. ఏం చేసినా తనకు ముట్టాలి అనే సూత్రాన్ని ఆయన పాటిస్తున్నట్టు అనుకూల వర్గాల్లోనే చర్చ నడుస్తోంది.

నిజానికి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఈ ఫ్యామిలీకి మంచి పేరు ఉంది. కానీ గత ఏడాదిన్నర కాలంగా ఈ నియోజకవర్గంలో సమాంతర ప్రభుత్వ నడుస్తోందని, ఏ పని చేపట్టినా తమకు నిర్దేశిత మొత్తంలో చేతులు తడపాల్సిందేనని బహిరంగంగానే బేరాలు పెడుతున్నారు అనేది టిడిపిలోనే వినిపిస్తున్న మాట. ఇది ఎవరో కావాలని పుట్టించింది కాదు. విపక్షాలు చేస్తున్న విమర్శలు కూడా కాదు. ఇవన్నీ వాస్తవాలేన‌ని టీడీపీ నాయ‌కులే చెబుతున్నారు. ఎన్నికలకు ముందు వాస్తవాలు తెలిసి అప్పటికప్పుడు సరిదిద్దుకోలేని పరిస్థితి ఏర్పడితే నష్టపోయేది ఎవరనేది పార్టీ ఆలోచించుకోవాలి.

ఇటు ఈ తరహా రాజకీయాలను ఎంత మంచి ప్రభుత్వమే అయినా ప్రజలు క్షమించరనేది పార్టీలు గ్రహించాలి. చంద్రబాబు పట్ల సానుకూలత ఉండొచ్చు. మంత్రి నారా లోకేష్ పట్ల సానుకూలతో ఉండొచ్చు. కానీ క్షేత్రస్థాయిలో నాయకుల పట్ల సానుకూలత లేకపోతే ఎటువంటి అనుభవం ఎదురవుతుందనేది టిడిపికి కొత్త కాదు. 2019లో ఇదే జరిగింది. చంద్రబాబునాయుడు దండాలు పెట్టినా కూడా ప్రజలు పట్టించుకోలేదు. తమ నాయకులు తప్పు చేశారని, ఇకపై తప్పు జరగకుండా చూస్తానని 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన వీడియోలు ఆడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి. యూట్యూబ్లో కనిపిస్తున్నాయి.

దీనిని బట్టి ఎన్నికలకు ముందే ఇటు పార్టీ అటు ప్రభుత్వం కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. నాయకులను సరైన దిశలో పెట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. లేకపోతే అది పార్టీలకే ఇబ్బందికర పరిణామంగా మారుతుంది. నాయకులను మార్చినంత మాత్రాన ఫలితం మారిపోతుంది అనుకుంటే గతంలో వైసిపి అదే చేసింది కదా. అప్పుడు ఏం జరిగిందనేది ఆలోచించాలి. కాబట్టి నాయకులు పార్టీ ఇద్దరు రెండు పట్టాల‌నే విష‌యాన్ని గ్ర‌హించాలి. నాయకులు తప్పు చేసినా లేక పార్టీ తప్పు చేసినా అది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది.

మహిళా ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ప్రజలకు మరింత సేవ చేస్తారని ఎవరైనా ఆశిస్తారు. కానీ దానికి భిన్నంగా రాష్ట్రంలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొద్దిపాటి నియోజకవర్గాలే కాదు ఇంకా అనేక నియోజకవర్గాల్లో మహిళా ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేరన్నది వాస్తవం. దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు.