ఏపీలో ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆసక్తికరం. శుక్రవారం(జూన్ 12) నాటికి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ రెండేళ్ల కాలంలో వైసీపీ అధినేత జగన్ ఏం చేశారు? అనేది ముఖ్యం. ప్రభుత్వం పరంగా గెలిచినా ఓడినా.. ఎమ్మెల్యేగా అసెంబ్లీని గౌరవించాలి. అసెంబ్లీకి రావాలి. సమస్యలపై ఎలుగెత్తాలి. మరీ ముఖ్యంగా మాజీ సీఎంగా ఆయనకు ఉండే బాధ్యత నెరవేర్చాలి.
కానీ, జగన్ ఈ విషయంలో పూర్తిగా వెనుకబడ్డారు. పొరుగున ఉన్న తమిళనాడులో 193 స్థానాలతో విజయం దక్కించుకుని ప్రభుత్వాన్ని చలాయించిన స్టాలిన్.. ఈ ఏడాది ఎన్నికల్లో 57 స్థానాలకు పడిపోయారు. అయినా.. ఆయన ప్రజలను వదిలి పెట్టలేదు. ఓడాం కదా.. అని ఇంట్లో కూర్చోలేదు. ఎన్నికల ఫలితం వచ్చిన మర్నాడే ప్రజల మధ్యకు వచ్చారు. ప్రజల సమస్యలపై మాట్లాడుతున్నారు. మరి జగన్ విషయంలో ఏం జరిగింది? ఆయన ఓటమిని అంగీకరించలేక పోతున్నారా? ప్రజలను అవమానిస్తున్నారా? అనేది కీలకం.
ఇక, పార్టీ పరంగా కూడా ఆయన యాక్టివ్గా ఉండడం లేదు. ఇప్పటి వరకు విపక్ష నేతగా ఒక్క బహిరంగ సభ నిర్వహించలేక పోయారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గళం వినిపించలేక పోయారు. తాడేపల్లి నివాసంలో మీడియా సమావేశాలకు మాత్రమే ఆయన పరిమితం అయ్యారు. ఇవన్నీ… మైనస్లు. ఇక, మరీ ముఖ్యంగా ఇప్పటికీ.. పేపర్ చూడకుండా మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. ఇది మరింత దారుణంగా జగన్ను డైల్యూట్ చేస్తోంది.
అన్ని విషయాలపై అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. కానీ, ఐదేళ్ల ముఖ్యమంత్రిగా.. రాష్ట్రంపై పట్టు ఉంటుంది. ఉండాలి కూడా. కానీ.. ఈ విషయంలోపై విఫలమయ్యారు. ఇప్పటికీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టునే ఆయన చదువుతున్నారు.
మరోముఖ్య విషయం.. తన పాలన బాగుందని పదే పదే చెప్పడం.. అయితే.. సహజంగా ఎవరైనా ఇదే చెబుతారని అనుకుంటే పొరపాటు. గతంలో తప్పులను ఒప్పుకోరు. జగన్ ఇదే చేసి నవ్వుల పాలవుతున్నారు. మూడు రాజధానుల నుంచి మావిగన్ వరకు వచ్చారు. ఇవన్నీ.. ఈ రెండేళ్లలో జగన్కు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చకపోగా.. మరింతగా ఆయన ఇమేజ్ను దెబ్బతీశాయన్నది వాస్తవం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
