ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం తవ్వుతున్న కొద్దీ సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా రూ.3 వేల కోట్లకు పైగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు ఉన్న ఈ కుంభకోణంలో తాజాగా వైసీపీకి చెందిన మరో కీలక నేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
వైసీపీ హాయంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేరు ఇప్పుడు ఈ కుంభకోణంలో ప్రముఖంగా వినిపిస్తోంది. గురువారం ఈ స్కాంకు సంబంధించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన సోదాల్లో కారుమూరి నివాసంతో పాటు ఆయన కార్యాలయాలు కూడా ఉన్నాయి.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కారుమూరి.,.. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత జగన్ వెంట నడిచిన కారుమూరి… 2019లో వైసీపీ తరపున అదే తణుకు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాదించారు.
తణుకు పరిధిలోని అత్తిలికి చెందిన కారుమూరి హైదరాబాద్ కేంద్రంగా బిజినెస్ చేస్తున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం తణుకు వైసీపీ ఇంచార్జీగా కూడా కొనసాగుతున్న కారుమూరి ఇంటిపై ఈడీ సోదాలు చేస్తున్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
2019లో వైసీపీ అదికారంలోకి వచ్చాక…జగన్ తొలి కేబినెట్ లో కారుమూరికి బెర్త్ దొరకలేదు. అయితే జగన్ తన కేబినెట్ ను ప్రక్షాళన చేస్తూ చాలా మందికి ఉద్వాసన పలికి వారి స్థానంలో కొత్త నేతలకు అవకాశం కల్పించగా… అప్పటిదాకా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని చేపట్టిన పౌర సరఫరాల శాఖ మంత్రిగా కారుమూరికి అవకాశం దక్కింది. జగన్ సీఎంగా దిగిపోయేదాకా కారుమూరి మంత్రిగా కొనసాగగా… ఆయనపై నాడే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి.
లిక్కర్ స్కాంను దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన అఫిడవిట్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక పరమైన నేరాల విషయంలో లోతైన దర్యాప్తు చేయడంలో దిట్టగా పేరు సంపాదించిన ఈడీ… ఏపీ లిక్కర్ కేసులో కూడా లోతుగా దర్యాప్తు చేస్తోంది.
ఈ క్రమంలోనే గురువారం నాటి సోదాల్లో భాగంగా ఈడీ అధికారులు కారుమూరి ఇంటిలో వాలిపోయారు. కారుమూరి వ్యాపార సంస్థల ఆధ్వర్యంలో జరిగిన లావాదేవీలను ఈడీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
