1500 కోట్ల స్కాం… వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు

వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారు గండిపేటలో రూ.1500
కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూములు కాజేసేందుకు బ్రహ్మనాయుడు నకిలీ జీవోలు సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ఆ భూమిని కొట్టేసేందుకు కొందరు ప్రభుత్వ అధికారుల సంతకాలను కూడా బ్రహ్మనాయుడు ఫోర్జరీ చేశారని ఆరోపణలు రావడం షాకింగ్ గా మారింది.

ఈ క్రమంలోనే బొల్లా బ్రహ్మనాయుడును అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, కోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురి కావడంతో బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు ఈరోజు బ్రహ్మనాయుడును తమిళనాడులో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కాంచీపురంలో ఆయన ఉన్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు.