వైసీపీ ఏపీలో డీలా పడిన విషయం తెలిసిందే. గత 2024 ఎన్నికల వరకు 151 మంది ఎమ్మెల్యేలతో కళకళ లాడిన వైసీపీ ఇప్పుడు.. 11 మంది ఎమ్మెల్యేలతోనే కునుకుపాట్లు పడుతోంది. రాష్ట్ర స్థాయిలో వైసీపీ పరిస్థితి డీలా పడిపోయిన దరిమిలా.. ఇప్పుడు ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఏపీలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి.
వీటిలో ఒకటి మాత్రమే సానా సతీష్. వాస్తవానికి ఇది కూడా వైసీపీదే. గతంలో మోపిదేవి వెంకటరమణకు ఈ సీటును జగనే కేటాయించారు. అయితే.. ఆయన వదులుకుని టీడీపీ కండువా కప్పుకొన్నారు. ఈ క్రమంలోనే సానా సతీష్ను టీడీపీ రాజ్యసభకు పంపించింది. ఇక, మిగిలిన మూడు స్థానాలు వైసీపీ అభ్యర్థులవే. వీరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఉన్నారు.
తాజా ఎన్నికల్లో వీరు సీట్లు కోల్పోతున్నారు. వైసీపీకి ఎలానూ అసెంబ్లీలో బలం లేని నేపథ్యంలో ఈ సీట్లు పూర్తిగా కూటమికే దక్కుతున్నాయి. అయితే… ఇప్పటి వరకు ఢిల్లీలో చక్రం తిప్పేందుకు వైసీపీకి ఈ సీట్లే కలిసి వచ్చాయి. కేంద్రంలోని బీజేపీ కూడా పలు సందర్భాల్లో వైసీపీ ఎంపీల మద్దతును తీసుకోవడానికి కూడా ఈ సంఖ్యా బలమే కారణమైంది. అయితే.. ఇప్పుడు ఆ నలుగురు పదవీ కాలం పూర్తికావడంతో వైసీపీకి దూరం కానున్నారు.
ఇక, మిగిలేది.. వైసీపీకి మరో నలుగురు మాత్రమే. ఇటు రాజ్యసభలోను, అటు లోక్సభలో కూడా.. వైసీపీకి నలుగురు చొప్పున సభ్యులు మాత్రమే మిగలనున్నారు. రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, తెలంగాణకు చెందిన ఎస్. నిరంజన్రెడ్డి(లాయర్). ఇక, లోక్సభకు వచ్చేసరికి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నవారు వైసీపీకి మిగిలారు. దీంతో సంఖ్యా బలం దాదాపు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా జగన్కు పరపతి ప్రమాదంలో పడిందన్న భావన వ్యక్తమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates