ఏపీ బీచ్‌ల‌లో.. గోవా క‌ల్చ‌ర్‌.. కీల‌క నిర్ణ‌యం!

ఏపీలో సుదీర్ఘ స‌ముద్ర తీర ప్రాంతం ఉంది. గుజ‌రాత్ స‌హా కొన్ని రాష్ట్రాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన తీర ప్రాంతం(బీచ్‌) ఏపీలో 9 వేల కిలో మీట‌ర్ల మేర‌కు విస్త‌రించింది. ప్ర‌స్తుతం ఆయా ప్రాంతాల్లో కేవ‌లం ర‌వాణా, పోర్టుల కార్య‌క్ర‌మాల‌కు మాత్ర‌మే వినియోగిస్తున్నారు. ప‌ర్యాట‌కులు వ‌చ్చినా.. కేవ‌లం స్నానాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నారు. తీర ప్రాంతంలో ఉండేందుకు.. అవ‌కాశం లేదు.

ఈ నేప‌థ్యంలో తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి తీర ప్రాంతాల‌ను కూడా.. ఆదాయ వ‌న‌రుగా మార్చుకునేందుకు.. తీర‌ప్రాంతాల‌కు మ‌రింత మంది ప‌ర్యాట‌కులు వ‌చ్చేలా చేసేందుకు వీలుగా.. బీచ్ ష్యాక్స్‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం దీనికిగాను ప్ర‌భుత్వం కొన్ని ప్రాంతాల‌ను మాత్ర‌మే ఎంపిక చేసుకుంది. విశాఖప‌ట్నం, సూర్య‌లంక‌, మ‌చిలీప‌ట్నం వంటి తీర ప్రాంతాల్లో బీచ్ ష్యాక్స్‌ను ఏర్పాటు చేస్తారు.

ఏంటిది? లాభ‌మేనా?

బీచ్ ష్యాక్స్ అనేది గోవా, సింగ‌పూర్ స‌హా.. ప‌లు స‌ముద్ర తీర దేశాల్లో ఎంతో ఫేమ‌స్‌. నైట్ అవుట్‌లు చేసేందుకు విందులు వినోదాలు చేసుకునేందుకు బీచ్ ష్యాక్స్ ఎంతో ప్ర‌త్యేకం. ఇక్క‌డ నైట్ స్టే చేసేందుకు అనుమ‌తి ఉంటుంది. తీర ప్రాంతాల్లో గుడారాల వంటి శాశ్వ‌త నిర్మాణాల‌ను కూడా ఏర్పాటు చేస్తారు. అలానే.. ఇక్క‌డ ప్ర‌భుత్వం అనుమ‌తించిన మ‌ద్యాన్ని కూడా విక్ర‌యిస్తారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. ఇత‌ర దేశాల్లో ఎలాంటి క‌ల్చ‌ర్ ఉంటుందో అచ్చంగా అలానే ఏపీలోనూ ఏర్పాటు చేయ‌నున్నారు.

బీచ్ ష్యాక్స్ పూర్తిగా రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ ప‌రిధిలోనే ఉంటాయి. ప్ర‌భుత్వం మాత్రం ప‌ర్య‌వేక్షిస్తుంది. ఇక‌, ఈ బీచ్ ష్యాక్స్‌లో విందు, వినోదాల కోసం ఏర్పాటు చేసుకునే ష‌ల్ట‌ర్లు.. ప్రైవేటు కంపెనీల‌కు కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న కేటాయిస్తారు.

మ‌ద్యం వినియోగానికి సంబంధించి ప్ర‌స్తుతం ఉన్న చ‌ట్టాల్లో మార్పులు చేయ‌నున్నారు. త‌ద్వారా.. ప్ర‌స్తుతం ఉన్న తీర ప్రాంతాలను విదేశీయుల‌కు.. ముఖ్యంగా హై క‌ల్చ‌ర్ ఆశించే వారికి చేరువ చేయ‌నున్నారు. త‌ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఏటా 200-300 కోట్ల రూపాయ‌ల అద‌న‌పు ఆదాయం రానుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు.