పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా హైదరాబాద్లో పర్యటించిన సమయంలోనే వెల్లడించారు. నేరుగా ఆయన విదేశీ మారక ద్రవ్యంలోటు గురించి చెప్పకపోయినా.. అందరూ పొదుపు చేయాలని.. తద్వారా విదేశీ మారకద్రవ్యం పెరుగుతుందని అన్నారు.
ఈ క్రమంలోనే పెట్రోలు, డీజిల్ పొదుపుతోపాటు ఏడాది పాటు బంగారాన్ని కూడా కొనుగోలు చేయొద్దని ప్రధాని మోడీ ప్రజలకు సూచించారు. ఇక ఆ తర్వాత.. కేంద్రంతోపాటు రాష్ట్రాలు కూడా పొదుపు మంత్రం పాటిస్తున్నాయి. బంగారం కొనుగోళ్లు కూడా 70 శాతం మేరకు తగ్గాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే.. ఇప్పుడు విదేశీ పత్రిక, పరిశోధనాత్మక జర్నలిజానికి పెట్టింది పేరైన బ్లూంబర్గ్ తాజాగా సంచలన విషయాన్ని వెల్లడించింది.
ప్రధాని మోడీ పొదుపు మంత్రం ప్రకటించే సరికే.. భారత దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగంటాయని బ్లూంబర్గ్ తెలిపింది. అంతేకాదు.. విదేశీ మారకద్రవ్యం కోసం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తన వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించేసిందని.. బ్లూంబర్గ్ బాంబు పేల్చింది. కేవలం ఫారెక్స్ నిల్వలను కాపాడుకునేందుకే ఈ చర్చ చేశారని కూడా పేర్కొంది. అమెరికా డాలరుతో పోలిస్తే.. రూపాయి విలువ భారీగా పతనమవుతోందని.. అందుకే.. బంగారాన్ని విక్రయించారని తెలిపింది.
ఖండించిన భారత్..
అయితే.. బ్లూంబర్గ్ కథనాన్ని కేంద్రం సహా ఆర్బీఐలు ఖండించాయి. ఇది తప్పుడు కథనమని పేర్కొన్నాయి. బంగారం విక్రయంపై వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవమని పేర్కొన్నాయి. ఆర్బీఐ వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా ఏటి కేడు పెరుగుతోందని తెలిపాయి. బ్లూంబర్గ్ కథనంలో వాస్తవం లేదని పేర్కొన్నాయి.
గతంలో చెప్పినవి నిజాలే..
అయితే.. గతంలో భారత్కు సంబంధించి బ్లూమ్బర్గ్ వెలువరించిన పలు కథనాలు వాస్తవమయ్యాయి. చైనా విషయంలో మోడీ వ్యవహరించిన తీరు.. పార్లమెంటులో తీవ్ర వివాదానికి దారి తీసింది. అలానే అదానీ పెట్టుబడుల కోసం.. ఎల్ ఐసీని విక్రయిస్తున్నారన్న కథనం కూడా దాదాపు నిజమైంది. దీంతో ఇప్పుడు బ్లూంబర్గ్ వెలువరించిన కథనం సంచలనంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates