మా అబ్బాయిని మంత్రిని చేయండి!

క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. సీఎం సిద్ద‌రామ‌య్య‌.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనంత‌రం.. ఆయ‌న పీఠాన్ని సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుత డిప్యూటీ ముఖ్య మంత్రి డీకే శివకుమార్ అధిరోహించే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో సిద్దూ కొన్నాళ్లుగా త‌ప్పుకోన‌ని మారాం చేసిన‌ప్ప‌టికీ.. తాజాగా మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో సీఎం సీటును వ‌దులుకున్నారు.

ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ సిద్ద‌రామ‌య్య‌కు కొన్ని ఆఫ‌ర్లు ఇచ్చిన‌ట్టు తెలిసింది. రాజ్య‌స‌భ సీటుతోపాటు.. జాతీయ రాజ‌కీయాల్లోనూ ప్రాధాన్యం పెంచుతామ‌ని చెప్పింది. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీలో కీల‌క‌మైన ఏఐసీసీలో బెర్త్ ఇస్తామ‌ని కూడా చెప్పిన‌ట్టు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే.. సిద్ద‌రామ‌య్య‌కు ఉన్న హిందీ భాష స‌మ‌స్య కార‌ణంగా.. ఆయ‌న ఈ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించినట్టు స్వ‌యంగా చెప్పారు.

ఈ నేప‌థ్యంలోనే త‌న కుమారుడు, ప్ర‌స్తుత ఎమ్మెల్యే య‌తీంద్ర‌ను మంత్రిని చేయాల‌ని.. ఇదే త‌న కోరిక అని చెబుతున్నారు. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ చెవిలో వేశారు. అయితే.. ఇక్క‌డ చిన్న మెలిక ఉంది. డీకే శివ‌కుమార్‌కు.. యతీంద్ర‌కు మ‌ధ్య రాజ‌కీయ విభేదాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో రేపు డీకే సీఎం అయితే.. ఆయ‌న కేబినెట్‌లో య‌తీంద్ర‌కు చోటు ఇస్తే.. విభేదాలు వ‌స్తాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.

శుక్ర‌వారం ఉదయం తన త‌న‌యుడు యతీంద్రతో కలిసి రాహుల్ గాంధీని క‌లుసుకున్న సిద్ద‌రామ‌య్య‌… త‌న కుమారుడికి మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. తాను కర్ణాటక రాజకీయాల్లోనే ఉంటానని, జాతీయ రాజ‌కీయాలు త‌న‌కు కొత్త అని ఆయ‌న వెల్ల‌డించారు. చివ‌రి శ్వాస వ‌ర‌కు.. క‌న్నడ ప్ర‌జ‌ల సేవ‌లోనే త‌రిస్తాన‌ని ఆయ‌న చెప్పారు. కాగా.. త‌న మిత్రులు కొంద‌రికి ఎమ్మెల్సీలుగా అవ‌కాశం ఇవ్వాల‌ని కూడా ఈ సంద‌ర్భంగా సిద్ద‌రామ‌య్య వెల్ల‌డించారు. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సిద్ద‌రామ‌య్య‌.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రిటైర్ కానున్నారు.