కర్ణాటక సీఎం మార్పు… ఢిల్లీలో షర్మిల

దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా మారింది. తాజాగా మిగిలి ఉన్న దక్షిణాది రాష్ట్రం ఏపీలో కూడా ఆ పార్టీ పుంజుకునే దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఏపీసీసీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా ఏపీలో ఓ మోస్తరుగా బలపడేందుకు ఆ పార్టీ సిద్దమవుతున్నట్లు సమారారం. షర్మిలకు రాజ్యసభ అవకాశం దక్కిందంటే మాత్రం…ఏపీలో గత ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న వైసీపీకి మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కాక తప్పవన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

ప్రస్తుతం కర్ణాటకలో సీఎం మార్పునకు సంబంధించిన కీలక చర్చలు దేశ రాజధాని హస్తినలో జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయగా… కొత్త సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు డీకే శివకుమార్ సిద్ధమయ్యారు. కొత్త కేబినెట్ కు సంబంధించిన కసరత్తు ఢిల్లీలో జోరుగా సాగుతోంది. ఈ కసరత్తులో పాలు పంచుకునే నిమిత్తం సిద్ధరామయ్య ఇప్పటికే ఢిల్లీ చేరగా… నేడో, రేపో డీకే కూడా ఢిల్లీ చేరనున్నారు. అదే సమయంలో  ఢిల్లీ రావాలన్న కాంగ్రెస్ అదిష్ఠానం పిలుపుతో శుక్రవారం వైఎస్ షర్మిల పతీ సమేతంగా ఢిల్లీలో వాలిపోయారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో షర్మిల దంపతులు భేటీ అయ్యారు.

అయినా కర్ణాటక రాజకీయాలపై చర్చ జరుగుతుంటే… ఏపీలో పీసీసీ చైర్ పర్సన్ గా ఉన్న షర్మిలను పార్టీ అధిష్ఠానం ఎందుకు పిలిచినట్లు అన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది. ఏపీ నుంచి కాంగ్రెస్ కు ఏ ఒక్క చట్టసభలోనూ ప్రాతినిధ్యం లేదు. ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లోనూ ఏపీ నుంచి ఆ పార్టీకి ఏ ఒక్క సీటూ దక్కే అవకాశం లేదు. అయితే కర్ణాటక నుంచి షర్మిలను రాజ్యసభకు పంపాలని పార్టీ నిర్ణయించిందని, అందుకే కర్ణాటక నేతలు ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఆమెను కూడా ఢిల్లీకి పిలిపిస్తున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.

ఈ విశ్లేషణలే నిజమైతే… షర్మిలతో పాటుగా ఏపీ కాంగ్రెస్ కు మంచి ఊపు వచ్చినట్టేనని చెప్పక తప్పదు. అంతేకాకుండా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కాకపోయినా… ఓ మోస్తరులో బలపడే అవకాశాలు లేకపోలేదు. షర్మిలకు రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా వైసీపీలో కొనసాగుతున్న మాజీ కాంగ్రెస్ నేతలను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే పని సులభం అవుతుందని అధిష్ఠానం పెద్దలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు ఏపీలో అత్యంత బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ… జగన్ పార్టీతో ఓ మోస్తరుగా దెబ్బ తినగా..  రాష్ట్ర విభజనతో పూర్తిగా దెబ్బ తినింది. తిరిగి రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే… ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిందేనన్న దిశగా అధిష్ఠానం కదులుతోంది.

ఇక కర్ణాటకలో కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న డీకేతో షర్మిలకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైఎస్ ఫ్యామిలీతో ఆది నుంచి సఖ్యతగా ఉంటూ వస్తున్న డీకే… షర్మిలను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించారని చెప్పాలి. తాజాగా ఇప్పుడు డీకేనే నేరుగా సీఎం కుర్చీ ఎక్కబోతున్న తరుణంలో… తనకు దగ్గరగా ఉన్న షర్మిలకు కర్ణాటక కోటా నుంచి రాజ్యసభ సీటిచ్చేందుకు డీకే ఉత్సాహం చూపుతారు కదా. అదే భావనతో సాగుతున్న పార్టీ అధిష్ఠానం డీకే ద్వారానే షర్మిలకు రాజ్యసభ సీటును ఇప్పించి… ఏపీలో పార్టీ బలోపేతానికి దారులు తెరవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే… ఇప్పటికే భారీగా నష్టపోయిన వైసీపీ మరింతగా పలచబడే ప్రమాదం లేకపోలేదన్న విశ్లేషణలు అయితే సాగుతున్నాయి.