ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సొంత పార్టీ మంత్రి అయినా సరే.. తప్పు జరుగుతుంటే ఊరుకునేది లేదని ఆయన నొక్కి వక్కాణించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయన తూర్పుగోదావరి జిల్లాలో గత రెండు రోజులుగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే వెంకటనగరం వద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ తాలూకు వ్యర్థాలన్నింటినీ గోదావరిలోకి వదిలేసి నదిని దారుణంగా కలుషితం చేస్తున్న దృశ్యాలను గమనించిన పవన్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ ఆయన అధికారులను నిలదీశారు. ఈ పర్యటనలో తనతో పాటే ఉన్న సొంత పార్టీ నేత, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోదావరి పుష్కరాల సమయంలో భక్తులు ఇక్కడికి పుణ్య స్నానాల కోసం వస్తారని, కానీ ఇక్కడ స్నానం చేస్తే పుణ్యం వస్తుందో లేదో కానీ, కచ్చితంగా రోగాలు మాత్రం వస్తాయని పవన్ అన్నారు. గోదావరి నదిలో ఇంత కాలుష్యం ఉంటుందని భక్తులు ఊహించలేరన్నారు పవన్. పుష్కర ఘాట్లను అందంగా ముస్తాబు చేస్తే సరిపోదని.. భక్తులు స్నానాలు చేసే నీళ్లు శుభ్రంగా ఉండాలి కదా, మరి నీళ్లు ఇంత కలుషితం అవుతుంటే మీరేం చేస్తున్నారు అని అధికారులను ప్రశ్నించారు.
వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అసహనం చెందిన పవన్.. పక్కనే ఉన్న మంత్రి కందుల దుర్గేష్ను ప్రశ్నించారు. పర్యాటక మంత్రిగా మీరు చెప్పాలి కదా.. దీనికి అంతిమంగా బాధ్యత వహించాల్సింది మీరే కదా అని పవన్ నిలదీశారు.
దీని మీద తరచుగా గొడవ జరుగుతూ ఉంటుందని.. ఆంధ్ర పేపర్ మిల్స్ వాళ్లతో యుద్ధాలు నడుస్తుంటాయని కందుల దుర్గేష్ వ్యాఖ్యానించగా.. దీని మీద యుద్ధాలు అవసరం లేదని, వీటిని నియంత్రించే చర్యలు అవసరమని పవన్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా బెదిరిస్తే తనకు చెప్పాలని పవన్ స్పష్టం చేశారు.
అన్నింటికంటే పర్యావరణం ముఖ్యమని, కాలుష్యాన్ని అడ్డుకుంటే పెట్టుబడులు ఆపేస్తారన్న వాదన కరెక్ట్ కాదని, అలా ఎందుకు ఆగుతాయని పవన్ ప్రశ్నించారు. పర్యావరణానికి, ప్రజలకు నష్టం జరుగుతోందంటే ఉపేక్షించేది లేదంటూ, సొంత పార్టీ మంత్రి మీద కూడా పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడం చూసి పవన్ నిబద్ధతను అందరూ కొనియాడుతున్నారు. మరి ఈ విషయాన్ని తర్వాత కూడా ఫాలో అప్ చేసి, గోదావరిలో కాలుష్యాన్ని అరికట్టి, శుభ్రంగా మారిస్తే పవన్కు మరిన్ని ప్రశంసలు దక్కుతాయనడంలో సందేహం లేదు.
This post was last modified on May 26, 2026 12:47 pm
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…