జనసేన కోవర్టులకు తేల్చి చెప్పిన పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం రాజమహేంద్రవరం వేదికగా చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీపై అనవసర విమర్శలు చేసే ప్రత్యర్థులు, రాజకీయ విశ్లేషణల పేరిట పార్టీని ఇబ్బందులకు గురి చేసే అనలిస్టులతో పాటుగా పార్టీలోనే ఉంటూ పార్టీకి నష్టం చేసే నేతలకు ఆయన సూటిగానే హెచ్చరికలు జారీ చేశారు. తనకు ఓపిక ఉన్నంతవరకే సహనంగా ఉంటానని చెప్పిన పవన్… పరిధి దాటి వ్యవహరించే నేతల విషయంలో మాత్రం కఠినంగానే ఉంటానని తేల్చి పారేశారు. ఇకపై పార్టీలో కోవర్టులనే మాట వినబడకూడదన్న రీతిలో పవన్ హెచ్చరికలు జారీ చేశారు.

గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పరిశీలన కోసం సోమవారం రాజమహేంద్రవరంలో పర్యటించిన పవన్… ఆ కార్యక్రమం తర్వాత నగరంలోనే పార్టీ శ్రేణులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలోనే ఉంటూ పార్టీకి నష్టం చేసే నేతల గురించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో పవన్ వ్యాఖ్యలు చేశారనే కంటే కూడా కోవర్టులకు ఆయన నేరుగా హెచ్చరికలు జారీ చేశారని చెప్పాలి. దేనికైనా ఓ పరిమితి ఉంటుందని చెప్పిన పవన్… ఆ పరిధి దాటకుండా వ్యవహరించాల్సిన బాధ్యత నేతలపై ఉందని చెప్పారు. ఆ పరిధి దాటితే ఏం చేయాలో తనకు తెలుసునని ఆయన వార్నింగిచ్చారు.

పార్టీలో అందరికీ ఒకేసారి పదవులు ఇవ్వడం సాధ్యం కాదన్న విషయాన్ని పరోక్షంగా చెప్పిన పవన్… పదవులు దక్కని నేతలే కోవర్టులుగా మారుతున్నారన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. తనకు నచ్చని వారికి పదవులు దక్కాయని పదవులు రాని వారు భావిస్తూ… ఆ పదవులు వచ్చిన నేతలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయా మీడియా హౌస్ లకు వెళుతున్న నేతలు కొందరు తమకు ఇష్టం లేని నేతలకు సంబందించి లేనిపోని విషయాలను ఆపాదిస్తూ బద్నాం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

అన్ని టీవీ ఛానెళ్లతో పాటు ఆయా మీడియా హౌస్ లలో తనకు చెందిన వారు ఎవరో ఒకరు ఉండే ఉంటారని, అలా తనకు అన్ని మీడియా సంస్థల నుంచి నిక్కచ్చి సమాచారం వస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. పార్టీకి చెందిన వ్యతిరేక వార్తలు ప్రసారం అయినప్పుడు ఆ వార్త ఎలా వచ్చిందని తాను ఆయా మీడియా హౌస్ లను అడుగుతానని, అప్పుడు వారు ఆయా అంశాలను చెప్పిన వారి గురించి తనకు చెప్పకపోరని అన్నారు. ఇలా తనకు పబ్టుబడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. తన సహనాన్ని పరీక్షించే విధంగా వ్యవహరించవద్దని పార్టీ శ్రేణులకు సూచించిన పవన్… పార్టీ నియమావళిని దాటి ముప్పును కొని తెచ్చుకోవద్దని సూచించారు.