విజయ్ గెలుపు చూసి అసూయ పడ్డా: పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…మరోమారు తమిళనాడు రాజకీయాలపైనా, సీఎంగా గెలిచిన స్టార్ హీరో దళపతి విజయ్ పైనా ఆసక్తికర కామెంట్లు చేశారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పరిశీలన కోసం సోమవారం రాజమహేంద్రవరంలో పర్యటించిన పవన్… ఆ తర్వాత సాయంత్రం నగరంలోనే పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు పాలిటిక్స్ ప్రస్తావన తీసుకుని వచ్చిన పవన్… కటౌట్ పెట్టేసిన విజయ్ నేరుగా సీఎం అయిపోయారని ఆసక్తికర కామెంట్ చేశారు.

తమిళనాడు రాజకీయాలకు, ఏపీ రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందన్న పవన్… అక్కడి గెలుపు ఓటములతో ఇక్కడి ఫలితాలను ఎలా పోలుస్తారని ఇదివరకే ఓ దఫా పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజా వ్యాఖ్యల్లోనూ అదే తరహాలో స్పందించిన పవన్… తమిళనాడు ఎన్నికలు అత్యంత సాఫీగా సాగిపోయాయని అన్నారు.

కటౌట్ లు కట్టేసిన విజయ్ వాటితోనే ఏకంగా సీఎం అయిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో పరిస్థితి అలా లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో డిప్యూటీ సీఎం కావడానికే తనకు ఏకంగా 12 ఏళ్ల సమయం పట్టిందని పవన్ అన్నారు.

తమిళనాడులో ఎన్నికలు అత్యంత సాఫీగా సాగిపోయాయన్న పవన్… వాటిని చూస్తే తనకే ఆశ్చర్యం వేసిందని.. నేను అసూయ పడ్డానని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఏమాత్రం కష్టపడకుండానే విజయ్ పార్టీ పెట్టడం, ఎన్నికల్లో నిలబడటం, ఏకంగా రెండు ప్రధాన పార్టీలను ఓడించి ఆయన సీఎం కుర్చీని అందుకోవడం చూస్తుంటే… నిజంగానే ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు.

అదంతా చూస్తుంటే…నిజంగానే కటౌట్లతోనే విజయ్ సీఎం అయ్యారని చెప్పవచ్చన్నారు. అయితే ఏపీలో రాజకీయ పరిస్థితులు తమిళనాడులోని పరిస్థితుల మాదిరిగా లేవని పవన్ అన్నారు. ఎక్కడి పరిస్థితులను బట్టి అక్కడి రాజకీయాలు సాగుతూ ఉంటాయని, అందుకే… ఒకదానితో మరో దానిని పోల్చడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.