ఏపీలో ఇప్పుడు ఓ వార్త పెను సంచలనమే రేపుతోంది. వైసీపీ హయాంలో జరిగిందని భావిస్తున్న లిక్కర్ కుంభకోణంలో ఆ పార్టీ నేతలతో పాటుగా టీడీపీ నేతల హస్తమూ ఉందా? అన్న కోణంలో ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
విజయవాడ ఎంపీగా కొనసాగుతున్న టీడీపీ నేత కేశినేని శివనాథ్ (కేశినేని చిన్ని) సతీమణి కేశినేని జానకి లక్ష్మికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి నోటీసులు అందాయన్న వార్త ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. అయితే తన సతీమణికి ఈడీ నోటీసులు జారీ అయినట్టుగా వప్తున్న వార్తల్లో నిజం లేదని స్వయంగా టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు.
టీడీపీ ఎంపీ సతీమణికి ఈడీ నోటీసులు రాలేదని స్వయంగా ఆ ఎంపీనే చెబుతోంటే… ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగిందన్న విషయం తేలాలి కదా. ఆ వివరాల్లోకి వెళితే… కేశినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మికి ఈడీ నోటీసులు జారీ అయినట్లుగా పలు వార్తా సంస్థలు సోమవారం ఓ వార్తను ప్రసారం చేశాయి.
ఈ నోటీసులు కూడా లిక్కర్ స్కాంకు సంబంధించిన విచారణలోనే భాగంగా వచ్చాయని కూడా సదరు కథనాలు తెలిపాయి. అంతేకాకాకుండా ఇప్పటికే ఓ దఫా జానకి లక్ష్మికి నోటీసులు వచ్చాయని, ఆమె విచారణకు రాకపోవడంతో మరోమారు ఈడీ నోటీసులు జారీ చేసిందని కూడా ఆ కథనాలు వెల్లడించాయి. ఈ నెల 27న తమ ముందుకు విచారణకు హాజరు కావాలని కూడా సదరు నోటీసుల్లో ఈడీ పేర్కొన్నట్లు సమాచారం.
అయితే ఈ వార్తలు వెలువడ్డ వెంటనే కేశినేని చిన్న రంగంలోకి దిగిపోయారు. లిక్కర్ స్కాంలో తన సతీమణికి ఈడీ నోటీసులు అన్న మాట పూర్తిగా అవాస్తవమని ఆయన చెప్పారు. ఫ్రైడ్ ఇన్ ఫ్రా కంపెనీకి ఈడీ నోటీసులు జారీ చేసిందని చెప్పిన చిన్ని… కొందరు ఆ నోటీసులు తన భార్యకు వచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఓ గృహిణిని ఇలా పూర్తి వివరాలు తెలుసుకోకుండా బజారుకు లాగడం మంచి పద్ధతి కాదని కూడా ఆయన అన్నారు. ఏదేనీ విషయంలో పూర్తి వివరాలు తెలుసుకుని వార్తలు ప్రసారం చేయాలని, ఇక మహిళలకు సంబంధించిన విషయాల్లో ఈ తరహా జాగ్రత్తలు మరింతగా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
కేశినేని చిన్ని చెప్పిన వివరాల ప్రకారం అసలు విషయంలోకి వస్తే… లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి, ఆయన సంస్థలకు ఇతర సంస్థలతో ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీసిందట. ఈ క్రమంలో రాజ్ కసిరెడ్డితో ఫ్రైడ్ ఇన్ ఫ్రాకు సంబంధాలున్నట్లు తేలిందట.
అంతేకాకుండా ఈ సంస్థకు రాజ్ కసిరెడ్డి నుంచి లావాదేవీలు కూడా జరిగాయట. ఈ లావాదేవీలు ఎలాంటివన్న అంశాన్ని తేల్చేందుకు రంగంలోకి దిగిన ఈడీ… ప్రైడ్ ఇన్ ఫ్రాకు నోటీసులు జారీ చేసిందట, సదరు సంస్థ ప్రతినిధులు ఈడీ ముందుకు విచారణకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.
అయితే ప్రైడ్ ఇన్ ఫ్రా, రాజ్ కసిరెడ్డి సంస్థలతో పాటు కేశినేని చిన్నికి సంబంధించిన ఓ సంస్థ ఒకే అడ్రెస్ పెట్టి కంపెనీలను రిజిష్టర్ చేసినట్టుగా గతంలో ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణలనూ చిన్ని ఖండించారు.
ఇక ప్రైడ్ ఇన్ ఫ్రాకు అసలు డైరెక్టర్లే లేరని కూడా చిన్ని వివరణ ఇచ్చారు. కేశినేని రియల్ ఎస్టేట్ కంపెనీలో మాత్రమే తన సతీమణి డైరెక్టర్ గా ఉన్నారని, ఆమెకు ప్రైడ్ ఇన్ ఫ్రాతో ఎలాంటి సంబంధాలు లేవని కూడా ఆయన వివరణ ఇచ్చారు. మొత్తంగా కేశినేని సతీమణికి ఈడీ నోటీసులు వచ్చాయన్న వార్తలు కలకలమే రేపాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates