వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకింది

కాలిఫోర్నియాలో కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకటం సంచలనంగా మారింది. కాలిఫోర్నియాలోని రెండు ఆసుపత్రుల్లో డబ్య్లూ. మాథ్యూస్ నర్సుగా పని చేస్తున్నారు. డిసెంబర్ 18వ తేదీన మాథ్యూస్ కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా మొదటి డోసు తీసుకున్నారు. టీకా వేయించుకున్న చేతిపై కాస్త ఎర్రగా అవటం తప్ప మరే సమస్య ఎదురుకాలేదని అనుకున్నారు.

అయితే టీకా వేయించుకున్న ఆరు రోజులకు సరిగ్గా క్రిస్తిమస్ రోజుకు ముందు మథ్యూస్ కు చలి, జ్వరం, ఒళ్ళునొప్పులు మొదలయ్యాయి. ఇది మామూలు జ్వరమే అనుకున్నారు. అయితే సమస్య పెరిగిపోవటంతో మాథ్యూస్ అనుమానంతో వెంటనే ఆసుపత్రికి వెళ్ళి రక్త పరీక్షతో పాటు కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు కూడా చేయించుకున్నారు.

పరీక్షల్లో వచ్చిన రిజల్టు చూసి ఆశ్చర్యపోయారు. తనకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కరోనా వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత కూడా తనకు కరోనా సోకిందని రిజల్టు రావటంతో మాథ్యూస్ నమ్మలేకపోతున్నారు. అయితే ఇదే విషయంపై ఓ వైద్య నిపుణుడు మాట్లాడుతు కరోనా వ్యాక్సినేషన్ వేయించుకున్నా కరోనా వైరస్ సోకటంలో ఆశ్చర్యపోవాల్సింది లేదన్నారు.

క్లినికల్ ట్రయల్స్ లో తేలిన ప్రకారం వ్యాక్సినేషన్ వేయించుకున్న 10 నుండి 14 రోజుల తర్వాతే రోగిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. తొలి డోసు తీసుకున్న తర్వాత మనలో రోగనిరోధక శక్తి 50 శాతం పెరుగుతుందట. రెండో దశ వ్యాక్సినేషన్ తర్వాత రోగనిరోధకశక్తి 95 శాతానికి పెరుగుతుందని వైద్య నిపుణుడు చెప్పారు. కరోనా టీకా వేయించుకున్నా భౌతిక దూరం పాటించటం, మాస్కు వేసుకోవటం తప్పనిసరిగా వైద్యులు చెబుతున్నారు. దీంతో కరోనా టీకా వేయించుకున్నాం కదాని ధైర్యంగా ఎక్కడపడితే అక్కడ తిరిగేస్తే ప్రమాదం పొంచిఉంటుందన్న విషయం మరచిపోకూడదు.