పశ్చిమ బెంగాల్ లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీకి మరోసారి ఇక్కడి ప్రజలు భారీ షాకిచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 294 అసెంబ్లీ స్థానాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 80 స్థానాలు మాత్రమే దక్కాయి. ఇక, తాజాగా ఫాల్తా నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో ఈ పార్టీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. అంతేకాదు.. అత్యంత దారుణంగా 7 వేల ఓట్లు మాత్రమే పొందారు. అదే సమయంలో బీజేపీ అభ్యర్థి దేవాన్షు పాండా.. లక్ష ఓట్ల పైచిలుకు మెజారిటీతో ఘన విజయం దక్కించుకున్నారు.
పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 21న నిర్వహించిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం జరిగింది. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి దేవాన్షు పాండా తొలి రౌండ్ లెక్కింపు నుంచే భారీ ఆధిక్యంలో కొనసాగారు. కాగా, గత నెల 29న జరిగిన ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఫాల్తా నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ రీ-పోలింగ్కు ఆదేశించింది. దీంతో ఈ నెల 21న రీ-పోలింగ్లో నిర్వహించారు. దాదాపు 88 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి పాండా 1,49,666 ఓట్లు రాగా రెండో స్థానంలో సీపీఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మీ 40,645 ఓట్లు దక్కించుకున్నారు. ఇక, అసలు పెద్దగా ఏమీ లేదనుకున్న కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుర్ రజాక్కు 10,084 ఓట్లు వచ్చాయి. కానీ.. ఇటీవలే అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ కేవలం 7,783 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. ఫలితంగా ఆయన డిపాజిట్ కోల్పోయారు. ఈక్రమంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకోగా.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మౌనంగా ఉండిపోయారు.
తృణమూల్ చరిత్రలో..
రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి తర్వాత.. తన పార్టీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోవడం ఇదే తొలిసారని పార్టీ వర్గాలు చెప్పాయి. ముఖ్యంగా ఫాల్తా నియోజకవర్గం ఆది నుంచి తృణమూల్కు కంచుకోట. గతనెలలో జరిగిన రెండో దశ ఎన్నికల్లో ఈవీఎంలకు టేపులు అంటించడంతో పాటు ట్యాంపర్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా బీజేపీ ఎన్నికల గుర్తుపై టేపులు అంటించడం వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మరోసారి ఎన్నికలు నిర్వహించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates