ఆ దేశ జాతీయ జంతువు ఆవే… ఎక్కడో తెలుసా..?

భారతదేశంలో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే మన పొరుగు దేశమైన నేపాల్‌లో గోవుకు ఇప్పటికే జాతీయ జంతు హోదా ఉన్న విషయం చాలా మందికి తెలియదు.

2015 సెప్టెంబర్ 20న నేపాల్ కొత్త ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆ సమయంలో అప్పటి అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్ గోవును దేశ అధికారిక జాతీయ జంతువుగా ప్రకటించారు. కొత్త రాజ్యాంగంలో గోవుకు ప్రత్యేక గుర్తింపు కల్పించడంతో పాటు దేశవ్యాప్తంగా గోవధను నిషేధిస్తూ చట్టపరమైన రక్షణ కూడా అమలు చేశారు.

నేపాల్‌లో అధిక సంఖ్యలో హిందువులు ఉండటంతో గోవును పవిత్రంగా భావించే సంప్రదాయం బలంగా కొనసాగుతోంది. హిందూ సంప్రదాయాల ప్రకారం గోవును లక్ష్మీదేవి స్వరూపంగా, సంపదకు, మాతృత్వానికి ప్రతీకగా భావిస్తారు. దీపావళి సందర్భంగా జరుపుకునే “తిహార్” పండుగలో గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించడం అక్కడ ఆనవాయితీ.

ఇక భారతదేశం 1973లో “రాయల్ బెంగాల్ టైగర్”ను అధికారిక జాతీయ జంతువుగా గుర్తించింది. బంగ్లాదేశ్ కూడా ఇదే జంతువును తమ జాతీయ జంతువుగా ప్రకటించింది.

ఇటీవల సోషల్ మీడియాలో “భారత ప్రభుత్వం గోవును జాతీయ జంతువుగా ప్రకటించబోతోంది” అనే వార్తలు వైరల్ అయ్యాయి. గోవు రక్షణ, అక్రమ రవాణా నివారణ కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుందనే ప్రచారం జరిగింది.

అయితే ఈ ప్రచారంపై కేంద్ర పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి ఎస్‌పీ సింగ్ బఘేల్ లోక్‌సభలో స్పష్టత ఇచ్చారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని తెలిపారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 2015లో గోవును రాష్ట్ర జంతువుగా ప్రకటించింది. గ్రామీణ జీవన విధానం, పశుసంవర్ధక రంగం, పాల ఉత్పత్తిలో గోవు పాత్రను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.