వివాదంలో పొంగులేటి… ఏం జరిగింది?

ponguleti srinivas reddy
ponguleti srinivas reddy

తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనవాసరెడ్డి మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి కాకముందు ఎలాంటి వివాదాలను దరిచేరనీయకుండా సాగిన పొంగులేటి… మంత్రి అయ్యాక వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా సహచర మంత్రి వాకిటి శ్రీహరి పట్ల వ్యవహరించిన తీరు కారణంగా పొంగులేటి వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన మీడియా ప్రతినిధుల ఎదుట… సాక్షాత్తు రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయం కేంద్రంగా చోటుచేసుకోవడం గమనార్హం.

అసలు ఈ వివాదం ఏమిటన్న విషయానికి వస్తే… శనివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ సుదీర్ఘంగా సాగింది. కేబినెట్ భేటీ అనంతరం సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించేందకు పొంగులేటి రాగా.. ఆయన వెంట మంత్రులు వాకిటి శ్రీహరా, అడ్డూరి లక్ష్మణ్ లు వచ్చారు. పొంగులేటి మధ్యలో కూర్చోగా.. మిగిలిన వారిద్దరూ ఆయనకు చెరోవైపున కూర్చున్నారు. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరిస్తున్న సమయంలో విషయమేమిటో తెలియదు గానీ… ఓ పేపర్ ను పొంగులేటి విసురుగా వాకిటిపైకి విసిరికొట్టారు. అంతేకాకుండా వాకిటి పట్ల పొంగులేటి ఆగ్రహంగా చూసినట్టుగా అనిపించింది.

అంతే… ఆ దృశ్యాలను చూసిన బీసీ సంఘాటు పొంగులేటి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. జరిగిందేదైనా సహచర మంత్రి అని కూడా చూడకుండా పొంగులేటి అలా పేపర్లను వాకిటిపై ఎలా విసురుతారని ఆ సంఘాల నేతలు మండిపడుతున్నారు. పొంగులేటి తీరు ముమ్మాటికీ ఆమోదయోగ్యం కాదని, తక్షణకే వాకిటికి పొంగులేటి క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. సారీ చెప్పేందుకు వారు పొంగులేటికి 24 గంటల డెడ్ లైన్ ను విధించారు.

తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటిని అవమానపరిచేలా పొంగులేటి వ్యవహరించారని వారు ఆరోపిస్తున్నారు. పొంగులేటితో సారీ చెప్పించాల్సిన బాధ్యత సీఎంగా రేవంత్ రెడ్డి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు ప్రతినిధిగా ఉన్న వాకిటిని పొంగులేటి ఎలా అవమానిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది.