తెలుగు సినీ పరిశ్రమలో చాలా కష్టపడి ఒక స్థాయి అందుకున్న వ్యక్తి బండ్ల గణేష్. చిన్న చిన్న కామెడీ పాత్రలు చేసే అతను.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో తీన్ మార్, గబ్బర్ సింగ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్తో బాద్షా, టెంపర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగాడు. ఈ మధ్య అతను సినీ నిర్మాణానికి దూరంగా ఉన్నప్పటికీ.. తరచుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటాడు.
తాజాగా గణేష్.. నటుడు రాజా రవీంద్రతో చేసిన ఒక ఇంటర్వ్యూలో ఒక షాకింగ్ విషయం చెప్పి ఆశ్చర్యానికి గురి చేశాడు. టాలీవుడ్కు చెందిన ఒక పెద్ద స్థాయి వ్యక్తి తనను కారణం లేకుండా చెప్పుతో కొట్టాడని గణేష్ వెల్లడించాడు. లెజెండరీ యాక్ట్రెస్ సౌందర్య మరణించిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు అతను తెలిపాడు.
అప్పట్లో తాను చిన్న స్థాయి నటుడినని.. పెద్దగా పని ఉండేది కాదని.. సినీ ప్రముఖుల వద్దకు వెళ్లి వాళ్ల దగ్గర కూర్చుని మాట్లాడ్డమే పనిగా ఉండేదని గణేష్ గుర్తు చేసుకున్నాడు. సౌందర్య చనిపోయిన రోజు తాను ఒక సినీ ప్రముఖుడి ఇంటికి వెళ్లి.. ఆయన ముందు కూర్చకున్నానని, ఏ కారణం లేకుండా ఆయన తనను చెప్పు తీసుకుని కొట్టాడని గణేష్ వెల్లడించాడు.
బేసిగ్గా ఆయన మంచి వాడేనని.. అప్పుడు ఆయన ఏదో టెన్షన్లో ఉన్నాడని అర్థమైందని.. తర్వాతి రోజు ఫోన్ చేసి సారీ కూడా చెప్పాడని బండ్ల గణేష్ తెలిపాడు. ఐతే తన జీవితంలో అదొక గొప్ప మలుపని.. అది తన మంచికే ఉపయోగపడిందని గణేష్ వెల్లడించాడు.
మరోవైపు తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్తో ఇంకో సినిమా చేయాలన్న కోరిక ఉందని గణేష్ తెలిపాడు. ప్రపంచంలోని తెలుగు వాళ్లందరూ ఉలిక్కి పడేలా పవన్తో ఒక అద్భుతమైన సినిమా తీయాలని.. అంతటితో తన బేనర్ను ఆపేయాలన్నది తన కోరిక అని గణేష్ వెల్లడించాడు. ‘టెంపర్’ తర్వాత గణేష్ సినిమాలే నిర్మించని సంగతి తెలిసిందే. పవన్తో తాను మరో సినిమా చేయబోతున్నట్లు గతంలో గణేష్ ప్రకటించినప్పటికీ.. ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates