నమ్మకం గెలుచుకున్న రెహమాన్

పెద్ది అనౌన్స్ మెంట్ టైంలో అందరికీ ఉన్న అనుమానం ఒకటే. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని తీసుకోవడం ద్వారా దర్శకుడు బుచ్చిబాబు ఏమైనా తొందరపడ్డాడేమోనని. ఎందుకంటే గురువు సుకుమారే ఇప్పటిదాకా ఆ రిస్క్ చేయలేదు. ఆయన కాంపౌండ్ నుంచి వచ్చిన ఇతర దర్శకులు అయితే దేవిశ్రీ ప్రసాద్ లేదా వేరే కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకున్నారు తప్పించి రెహమాన్, ఇళయరాజా లాంటి లెజెండ్స్ పేర్లను ఆప్షన్లుగా కూడా పెట్టుకోలేదు.

రెహమాన్ మీద ఎవరికీ సందేహం లేదు. కానీ చాలా సంవత్సరాలుగా ఆయన స్థాయి ఆల్బమ్ పడలేదనేదే అభిమానుల బాధ. పొన్నియిన్ సెల్వన్, తగ్ లైఫ్ లాంటివి మణిరత్నం డైరెక్షన్ లోనే వచ్చినా పాటల పరంగా ఎంత నిరాశ పరిచాయో చెప్పనక్కర్లేదు. కానీ పెద్దికి జరిగింది వేరు. చికిరి చికిరి భాషతో సంబంధం లేకుండా ఇండియా వైడ్ ఊపేసింది. రైరై రారయ్ లో రామ్ చరణ్ స్టెప్పులు చాలా వైరల్ అయ్యాయి. ట్రైలర్ మీద వచ్చిన మిశ్రమ స్పందన బిజిఎంని హైలైట్ చేయలేకపోయింది.

నిన్న భోపాల్ స్టేజి మీద రెహమాన్ నుంచి వచ్చిన ఐటెం సాంగ్ హల్లేల్లెలో, మస్సా మస్సా అంటూ సాగే టైటిల్ సాంగ్ రెండూ ఆహుతులను ఊపేశాయి. అంటే ఆల్బమ్ లో ఉన్న బ్యాలన్స్ పాటలు కూడా ఛార్ట్ బస్టర్ అయినట్టే. వీటి తాలూకు విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని యూనిట్ చెబుతోంది. ఏదైతేనేం బెస్ట్ ఇస్తానని బుచ్చిబాబుకి హామీ ఇచ్చిన రెహమాన్ ఆ మేరకు మాట నిలబెట్టుకున్నారు. అన్ని పాటలు పాస్ కావడంలో వీళ్లిద్దరి పాత్ర చాలా కీలకం.

ఈ టాపిక్ ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణముంది. ఏఆర్ రెహమాన్ ఈ పెద్దినే తన మొదటి తెలుగు సినిమా అన్న రేంజ్ లో ప్రమోట్ చేసుకుంటున్నారు. నిజానికి ముప్పై సంవత్సరాల క్రితమే వెంకటేష్ సూపర్ పోలీస్, రాజశేఖర్ గ్యాంగ్ మాస్టర్ తో ఆయన సంగీత తెరంగేట్రం టాలీవుడ్ లో జరిగిపోయింది. పవన్ కళ్యాణ్ కొమరం పులి ఆయనదే. ఏ మాయ చేసావే డ్యూయల్ లాంగ్వేజ్ అనుకున్నా మిగిలినవి స్ట్రెయిట్ సినిమాలే. వాటిని కాకుండా పెద్దిని ఇంత ఓన్ చేసుకోవడమంటే విశేషమేగా.