`కాక్రోచ్` దెబ్బ‌కు పెద్ద పార్టీలు విల‌విల… నిజ‌మేనా?

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ పేరుతో వెబ్‌సైట్ స‌హా.. సోష‌ల్ మీడియా హ్యాండిళ్ల‌లో జరుగుతున్న ఉద్య‌మం(పార్టీ) పెను ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితిని ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించినా.. ఇది వాస్త‌వ‌మేన‌ని చెప్పాలి. ఇన్ స్టాలో కాక్రోచ్ జ‌న‌తాపార్టీని ఫాలోఅవుతున్న వారి సంఖ్య 2 కోట్ల 35 ల‌క్ష‌ల‌కు చేరింది. ఇక‌, వెబ్ సైట్ వీక్ష‌లు కూడా ల‌క్ష‌ల్లోనే పెరిగారు. ఇక‌, ఎక్స్ ఖాతాను మూసివేసినా.. తిరిగి ప్రారంభించిన‌.. కాక్రోచ్ రిట‌ర్న్ ఎగైన్‌కు కూడా ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు సొంతం అవుతున్నారు. రోజు రోజుకూ.. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ బ‌ల‌ప‌డుతోంద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి.

మోడీ మాట‌ను బ‌ట్టి!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మాట‌ల‌ను బ‌ట్టి.. కాక్రోచ్ పార్టీపై బీజేపీ ఎంత పెద్ద ఎత్తున ప‌రిశీల‌న చేస్తోంద‌న్నది అర్ధం అవుతుంది. సాధార‌ణంగా కేంద్ర మంత్రి వ‌ర్గ స‌మావేశాలో ప్ర‌ధాని మోడీ.. సంక్షేమ ప‌థ‌కాలు.. చేప‌ట్టే అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు సంబం ధించిన ప్ర‌తిపాద‌న‌ల‌పై మంత్రుల‌తో చ‌ర్చిస్తారు.

కానీ ఈ ద‌ఫా ఆయ‌న సోష‌ల్ మీడియా గురించి.. బీజేపీ నాయ‌కులు, కేంద్ర మంత్రులు సోష‌ల్ మీడియాలో ఏ విధంగా ఉన్నార‌న్న విష‌యాన్ని ఆరా తీశార‌ని జాతీయ మీడియావ‌ర్గాలు చెబుతున్నాయి. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతోనే ఇప్పుడు కాక్రోచ్ జ‌న‌తా పార్టీకి కోట్ల మంది చేరువ అయ్యారు. దీనిని గ‌మ‌నించిన ప్ర‌ధాని రీల్స్ నుంచి వీడియోల వ‌ర‌కు.. మంత్రుల‌కు క్లాస్ ఇచ్చార‌ని స‌మాచారం. దీనిని ప్ర‌త్యేకంగానే చూడాల్సి ఉంటుంది.

ఎందుకిలా?

ప్ర‌స్తుతం దేశంలో రెండే కూట‌మి పార్టీలు ఉన్నాయి. 1) ఎన్డీయే. 2) ఇండియా కూట‌మి. ఈ రెండు మినహా.. ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యా మ్నాయ రాజ‌కీయ పార్టీలు లేకుండా పోయాయి. అయితే.. ఈ రెండు కూట‌ముల‌కు ప్ర‌జ‌లు వ‌రుస‌గా అధికారం అప్ప‌గించారు. కానీ.. ప్ర‌జ‌ల‌కు ఒరిగింది ఏమీలేద‌న్న వాద‌న ఉంది.

అయితే.. హిందూత్వ‌వాదం బ‌ల‌ప‌డ‌డం.. లేక‌పోతే.. రాష్ట్రాల‌పై ఆధిప‌త్య ధోర‌ణి.. ఈ రెండు మిన‌హా.. దేశంలో నిరుద్యోగ స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. అవినీతి కూడా అంతం కాలేదు. ఇక‌, కీల‌క‌మైన ప్ర‌గ‌తి అంశాలు స‌హా.. దేశంలో జ‌రుగుతున్న కులాలు, మ‌తాల చిచ్చు కూడా కంట్రోల్ కాలేదు. దీంతో ప్ర‌జ‌లు ప్ర‌త్యామ్నాయం కోసం వేచి చూస్తున్నార‌న్న‌ది వాస్త‌వం.

ముఖ్యంగా యువ‌త పెద్ద ఎత్తున ఆశ‌లుపెట్టుకున్నా మోడీ స‌ర్కారు ఆశించిన విధంగా కాదు.. అంత‌కు త‌క్కువ‌గా అయినా.. ఎలాంటి కార్యాచ‌ర‌ణ‌ను చూప‌లేకపోతోంది. మోడీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఉత్త‌రాదిలో ఆల‌యాల అభివృద్ధి, నిర్మాణానికి ఇచ్చిన ప్రాధాన్యం.. నిరుద్యోగుల‌కు, విద్య‌, వైద్య రంగాల‌కు.. ఇవ్వ‌లేద‌ని అనేక నివేదిక‌లు ఆక్షేపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల్లో ముఖ్యంగా యువ‌త‌, నిరుద్యోగుల్లో ప్ర‌త్యామ్నాయం కోసం వెతికే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో త‌మ వాయిస్ వినిపించే గొంతుగా కాక్రోచ్ జ‌నతా పార్టీ వైపు చూస్తున్నారు. అయితే.. ఇది పార్టీగా మారుతుందా? ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తుందా? పోటీ చేస్తుందా? అనేది చూడాలి. కానీ, ప్ర‌జ‌లు మాత్రం ప్ర‌త్యామ్నాయం కోసం వేచి ఉన్నార‌న్న‌ది సుస్ప‌ష్టం.