వచ్చే ఏడాది జూలైలో ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పుష్కరాలను కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని నిర్ణయించింది. దీనికిగాను.. ఏకంగా 1000 కోట్ల రూపాయలను కేటాయించాలని తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి మంత్రులు ఆమోదం తెలిపారు. అంతేకాదు.. ఏర్పాట్లు కూడా తక్షణమే ప్రారంభించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమంలో తక్షణం 300 కోట్ల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించినట్టుసీఎం చెప్పారు.
మన ప్రభుత్వంలో వచ్చిన తొలి పుష్కరాలు ఇవే. ఈ పుష్కరాలు.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా అంగరంగ వైభవంగా జరగాలి. ఎక్కడా ఏ లోటూ రాకుండా చూసుకుందాం. అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించేందుకు.. నిర్వహణను సమన్వయం చేసుకునేందుకు మంత్రులతో కూడిన 4 కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై కసరత్తు చేసే బాధ్యతను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగించారు. పుష్కరాలకు ప్రత్యేక బస్సులు పెట్టడంతోపాటు.. భక్తులకు నదీ తీరం వెంబడి సౌకర్యాలను ఏర్పాటు చేయడం వంటివి కీలకంగా ఉండాలన్నారు.
కాగా.. గోదావరి పుష్కరాలు మూడు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించనున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలలో గోదావరి కీలక నది కావడంతో ఆయా ప్రభుత్వాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు.. ప్రస్తుతం పాఠశాలలకు మాత్రమే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళా శాలలకు కూడా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనిపై కూడా మంత్రులతో చర్చించారు.
డ్రాపౌట్లు ఎక్కువగా పెరుగుతున్నది 10వ తరగతి తర్వాతేనని.. దీనిని నివారించేందుకు కళాశాలల్లో నూ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. దీనికి కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఏడాదికి 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు.
కరీంనగర్ జిల్లాలో కేంద్ర భద్రతా దళాలకు సంబంధించిన శిక్షణ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలపై కూడా మంత్రి వర్గం చర్చించింది. అస్సాం రైఫిల్స్ సహా.. పలు కేంద్ర రక్షణ రంగ సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయించాలని నిర్ణయించింది. దీనికి కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates