లోకేశ్ బాటలో రేవంత్ సర్కారు

టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్… ఏపీలో విద్యా శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీలో సర్కారీ విద్యా వ్యవస్థ అద్భుతాలను సాధిస్తోంది. ఇందుకు దారి తీసిన పరిణామాలను పరిశీలిస్తే… ఏపీలో అప్పటిదాకా పాఠశాలల్లో మాత్రమే మధ్యాహ్న భోజన పథకం అమలయ్యేది.

లోకేశ్ మంత్రిగా వచ్చాక… ఈ పథకాన్ని జూనియర్ కాలేజీల దాకా విస్తరించారు. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. తాజాగా లోకేశ్ చూపిన ఈ బాటలోకి తెలంగాణ ప్రభుత్వం కూడా వచ్చేసింది. తెలంగాణవ్యాప్తంగా జూనియర్ కాలేజీల్లో ఉదయం అల్పాహారంతో పాటు పాటు అందించాలని శనివారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో శనివారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాగంగా విద్యా శాఖకు సంబంధించి పలు కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది.

ఆయా శాఖలను మంత్రులకు కేటాయించిన రేవంత్… విద్యా శాఖను మాత్రం ఎవరికీ కేటాయించకుండా తన వద్దే ఉంచుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సర్కారీ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి అత్యుత్తమ ఫలితాలను రాబట్టాలన్న కసితో రేవంత్ సాగుతున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణ విద్యా శాఖలో పలు కొత్త నిర్ణయాలు తీసుకున్న రేవంత్ సర్కారు… తాజాగా జూనియర్ కళాశాలల్లో భోజన పథకాన్ని విస్తరింపజేయాలని తీర్మానించింది. ఈ మేరకు కళాశాలలకు వచ్చే విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటుగా పాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పల్లె సీమల నుంచి మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న జూనియర్ కళాశాలలకు వస్తున్న విద్యార్థులకు ప్రయోజనం లభించనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.