ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణకు చెందిన రాజకీయ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాల్సిందేనని జగ్గారెడ్డి ఆసక్తికర కామెంట్ చేశారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు చంద్రబాబు గానీ, జగన్ గానీ పూర్తి చేయలేరని కూడా మరింత సంచలన కామెంట్ చేశారు. ఇందుకు ఆయన తనదైన శైలి విశ్లేషణను కూడా వినిపించారు.
తెలుగు నేలకు సంబంధించి పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని జగ్గారెడ్డి తనదైన శైలి వాదనను వినిపించారు. అంతేకాకుండా తెలంగాణ వాసుల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీనేనని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా ఏపీ విషయాలతో ఏమాత్రం సంబంధం లేని జగ్గారెడ్డి… ఆ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై తనదైన శైలి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తెలంగాణ సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వస్తేనే… ఏపీలోని సమస్యలు పరిష్కారం అవుతాయని జగ్గారెడ్డి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అయినా, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అయినా, ఏపీకి ప్రత్యేక హోదా అయినా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితేనే ఏపీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. ఇచ్చిన మాటను నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీకి ఉన్న లక్షణమన్న జగ్గారెడ్డి… ఈ విషయాన్ని జనం కూడా పరిశీలించాలని పిలుపునిచ్చారు.
ఇక ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు గానీ, మాజీ సీఎం జగన్ గానీ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేరని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే… అటు చంద్రబాబు గానీ, లేదంటే ఇటు జగన్ గానీ ప్రధాని మోదీకి ఊడిగం చేయాలని, అలా చేసేందుకు వారిద్దరూ సిద్ధంగా లేరని జగ్గారెడ్డి అన్నారు. ఈ అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన చెప్పారు. ఎవరేమనుకున్నా కూడా రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే పోలవరం పూర్తి అవుతుందని ఆయన ఒకింత గట్టిగానే చెప్పుకొచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates