విజ‌య్ నుంచి చాలా నేర్చుకోవాలేమో జ‌గ‌న్ స‌ర్‌!

త‌మిళ‌నాడులో టీవీకే అధినేత‌ విజ‌య్ గెలుపు గుర్రం ఎక్క‌డం, అక్క‌డ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం విష‌యంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున సెల్ఫ్ గోల్ చేసుకున్న విషయం తెలిసిందే. విజ‌య్ త‌న ప్ర‌చారంలో జ‌గ‌న్ ఫొటోను ప‌ట్టుకుని తిరిగిన ఘ‌ట్టాల‌ను ప‌దే ప‌దే వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌సారం అయింది. మొత్తంగా విజ‌య్ .. విజ‌యం వెనుక జ‌గ‌న్ ఉన్నార‌న్న‌ది వైసీపీ వాద‌న‌. ఇది ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. తాజాగా ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు తీసుకున్న విజ‌య్‌.. అనుస‌రిస్తున్న విధానాల‌ను ప‌రిశీలిస్తే.. జ‌గ‌న్ కొన్న‌యినా నేర్చుకుంటే బెట‌ర‌నేది నెటిజ‌న్ల వాద‌న‌.

1) సొంత క్యారేజీ: ముఖ్య‌మంత్రిగా విజ‌య్‌కు ప్ర‌భుత్వ ఖ‌ర్చుల‌తో భోజ‌నం చేసే అవ‌కాశం ఉంది. ఆయ‌న స్టాల్ హోట‌ల్ నుంచి భోజ‌నం తెప్పించుకునేందుకు లేదా వెళ్లి తినేందుకు కూడా అవ‌కాశం ఉంది. కానీ, ఆయ‌న ఇంటి నుంచి క్యారేజీ తెచ్చుకుని.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. అంటే.. ప్ర‌భుత్వ సొమ్మును దుబారా కానివ్వ‌న‌ని.. ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం రోజు చెప్పిన మాట‌కు క‌ట్టుబడ్డార‌న్న వాద‌న వినిపించేలా చేసింది. దీని నుంచి జ‌గ‌న్ చాలానే నేర్చుకోవాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

2) గ‌త ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు: గ‌త ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను తానుకూడా పాటిస్తాన‌ని విజ‌య్ ప్ర‌క‌టించారు. అయితే.. ఏమేర‌కు వాటిని పాటిస్తారో అన్న సందేహం క‌లిగింది. కానీ.. ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌.. తీసుకున్న నిర్ణ‌యాలు చూస్తే.. నిజంగానే వాటిని అమ‌లు చేస్తున్నార‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. తాజాగా అమ్మ క్యాంటీన్ల‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తూ.. విజ‌య్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ క్యాంటీన్ల‌లో పేద‌ల‌కు అందించే ఆహారం మ‌రింత నాణ్య‌త‌గా ఉండాల‌ని.. రుచిగా, శుచిగా కూడా అందించాల‌ని ఆదేశించారు. అంతేకాదు.. తాను అప్పుడ‌ప్పుడు వాటిని త‌నిఖీ కూడా చేస్తానని చెప్ప‌డం ద్వారా.. ఎప్పుడో అన్నాడీఎంకే ప్ర‌భుత్వంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ల‌ను మ‌రింత బ‌లోపేతం చేసే దిశ‌గా అడుగులు వేసిన‌ట్టు అయింది.

అంతేకాదు.. ఆయా క్యాంటీన్ల‌ను మ‌రింత బ‌లోపేతం చేసే విష‌యంలోనూ విజ‌య్ త‌క్ష‌ణ నిర్ణ‌యం తీసుకున్నారు. వంట పాత్రలు, ఇత‌ర మౌలిక స‌దుపాయాల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించారు. త‌క్ష‌ణ‌మే సంబంధిత నిధులు విడుద‌ల చేయాల‌ని కూడా ఆదేశించారు. అలాగే.. ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల నుంచే త‌క్కువ ధ‌ర‌ల‌కు స‌రుకులు అందించాల‌ని కూడా ఆదేశించారు. త‌ద్వారా.. విజ‌య్‌.. గ‌త ప్ర‌భుత్వాలు తీసుకున్న నిర్ణ‌యాల‌ను మ‌రింత బ‌లోపేతం చేశారు. కానీ, ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌.. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న అన్న క్యాంటీన్లు ర‌ద్దు చేశారు. పైగా.. వాటిని తీసేశారు కూడా.