కేసీఆర్ మారిపోయాడు.. కొత్త రుజువు

ముఖ్య‌మంత్రి అయ్యాక కేసీఆర్‌లో ఎన్న‌డూ చూడ‌ని మార్పులు చూస్తున్నారు జ‌నం ఈ మ‌ధ్య‌. తాను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న నిర్ణ‌యాల‌పై వెన‌క్కి త‌గ్గ‌డం, జ‌నాల్ని మ‌చ్చిక చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం లాంటి ల‌క్ష‌ణాల‌తో కేసీఆర్ భిన్నంగా క‌నిపిస్తున్నారు తెలంగాణ సీఎం. దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ప్ర‌తికూల ఫ‌లితాల ప్ర‌భావ‌మో ఏమో కానీ.. తాను ప‌ట్టుబ‌ట్టి తీసుకొచ్చిన‌ నియంత్రిత సాగు, ధ‌ర‌ణి లాంటి వాటిపై కేసీఆర్ వెన‌క్కి త‌గ్గ‌డం తెలిసిందే. అలాగే ఎప్ప‌ట్నుంచో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాల భ‌ర్తీ, ఉద్యోగుల జీతాల పెంపున‌కు కూడా ఆయన గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు.

రాష్ట్రంలో తొమ్మిది ల‌క్ష‌ల మందికి పైగా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కొత్త సంవ‌త్స‌ర కానుక అన్న‌ట్లుగా జీతాల పెంపు, ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు పెంపు నిర్ణ‌యాల అమ‌లుకు శ్రీకారం చుడుతున్న‌ట్లుగా కేసీఆర్ ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లో అన్ని శాఖల ఉద్యోగులకు వేతనాలు, పదవీ విరమణ వయస్సును పెంచాలని నిర్ణ‌యించిన కేసీఆర్‌.. ఇందుకోసం ప్ర‌భుత్వ ముఖ్య కార్య‌ద‌ర్శి‌ సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు. వేతనాల పెంపు సహా వివిధ అంశాలపై ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ ఛార్జ్‌డ్, డెయిలీ వైజ్, ఫుల్ టైమ్ కాంటింజెంట్, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులతో పాటు హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పింఛనుదారులు.. ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని కేసీఆర్ ప్ర‌క‌టించ‌డం విశేషం.

అన్నిశాఖల ఉద్యోగులు కలిపి రాష్ట్రంలో 9,36,976 మంది ఉంటారని.. అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఆర్టీసీ ఉద్యోగుల‌కు సైతం వేతనాలను పెంచాలని కేసీఆర్‌ నిర్ణయించారు. వేతనాల పెంపుతో ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం పేర్కొన్నారు. మరోవైపు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని కేసీఆర్ ఇప్ప‌టికే అధికారులను ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.