ఏపీ నుంచి పెద్ద‌ల స‌భ‌కు అమిత్ షా శిష్యుడు?

ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్య‌స‌భ స్థానాల్లో ఒక‌టి బీజేపీకి కేటాయించ‌నున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది. మొత్తం నాలుగు స్థానాల్లో రెండు టీడీపీ ఉంచుకుని.. మిగిలిన రెండు స్థానాల‌ను మిత్ర‌ప‌క్షాలైన జ‌నసేన‌, బీజేపీల‌కు కేటాయించ నుంది. దీనిపై టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి అమిత్ షా శిష్యుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌మిళ‌నాడుకు చెందిన అన్నామలైని పెద్ద‌ల స‌భ‌కు పంపించ‌నున్నార‌న్న చ‌ర్చ సాగుతోంది.

దీనిపై త‌మిళ మీడియా కూడా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. త‌మిళ‌నాడులో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల‌లో అన్నామ‌లైకి ఎక్క‌డా టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డం.. ఆయ‌న‌ను కేవ‌లం ప్ర‌చారానికి మాత్ర‌మే ప‌రిమితం చేయ‌డం వంటివి ఈ వాద‌న‌కు బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. ఐపీఎస్ అదికారి అయిన అన్నామ‌లై.. క‌ర్ణాట‌క‌లో ప‌నిచేసేవారు. ఆ స‌మ‌యంలో అమిత్ షా ఆయ‌న‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. ఇలా.. ఆయ‌న‌ను ఐపీఎస్ నుంచి వాలంట‌రీ రిటైర్మెంట్‌కు ప్రోత్స‌హించి.. బీజేపీ కండువా క‌ప్పారు. అనంత‌రం.. తమిళ‌నాడు రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా నియ‌మించారు.

ఈ ఏడాది ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు కూడా అన్నామ‌లై.. త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్‌గానే వ్య‌వ‌హ‌రించారు. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న‌కు కేంద్రంలో మంత్రి ప‌ద‌విని ఇస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో అన్నామ‌లైని ప్ర‌చారానికి మాత్ర‌మే ప‌రిమితం చేసిన బీజేపీ.. ఇప్పుడు ఏపీ కోటాలో రాజ్య‌స‌భ‌కు పంపించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అనంత‌రం.. ఆయ‌న‌కు మంత్రి వ‌ర్గంలోనూ చోటు ల‌భిస్తుంద‌ని బీజేపీ త‌మిళ‌నాడు వ‌ర్గాలు చెబుతున్నాయి.

బ‌ల‌మైన వాయిస్‌తో పాటు.. హిందూత్వ‌కు కూడా క‌నెక్ట్ అయిన అన్నామ‌లైని పెద్ద‌ల స‌భ‌కు పంపించ‌డం ద్వారా త‌మిళ‌నాడు లో బీజేపీ పుంజుకునే అవ‌కాశం ఉంటుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు. కాగా.. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు నుంచి ఎల్‌. మురుగ‌న్ కేంద్రంలో మంత్రిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇక‌, మాజీ గ‌వ‌ర్న‌ర్‌.. త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్‌కు కూడా కేంద్రంలో కీల‌క ప‌ద‌విని అందించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆమె గ‌త, ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు.