‘రంగా గారికి ప్రాణహాని ఉన్నప్పుడు ఏం చేశారయ్యా మీరంతా?’ – పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం తనదైన శైలిలో అన్ని అంశాలపై కూలంకషంగానే స్పందించారు. అనారోగ్యం కారణంగా ఇటీవలే ఆపరేషన్ చేయించుకుని స్వల్ప వ్యవధి మాత్రమే రెస్ట్ తీసుకున్న పవన్… గురువారమే మంగళగిరి చేరుకున్నారు. శుక్రవారం మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన శ్రేణుల సమావేశంలో ప్రసంగించిన పవన్… ఈ వారం పది రోజులుగా తన గురించి జరిగిన అన్ని రకాల చర్చలకు సమాధానం ఇచ్చారు. తన సొంత సామాజిక వర్గం కాపులపైనా ఆయన తనదైన శైలి సెటైర్లు సంధించారు. అసలు మిమ్మల్ని నమ్మేదెలా అని కూడా ఆయన ప్రశ్నించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

దివంగత వంగవీటి రంగా గురించి చాలా మంది నేతలు ప్రస్తావిస్తున్న విషయంపై ప్రతిస్పందించిన పవన్…రంగా గారు బతికుండగా ఆయనను ఎందుకు రక్షించుకోలేకపోయారని ప్రశ్నించారు. బతికుండగానే తనకు ప్రాణహానీ ఉందని స్వయంగా రంగా గారే చెప్పినప్పటికీ ఏ ఒక్కరు కూడా ఆయనను రక్షించుకునే యత్నం చేయలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. బతికుండగా మనిషిని కాపాడుకోలేకపోయిన వారు చనిపోయాక మాత్రం కబుర్లు చెబుతున్నారంటూ ఆయన తనదైన రీతిలో సెటైర్లు సంధించారు.

ఇక తానేదో ఒక సామాజిక వర్గానికి అండగా నిలుస్తున్నానని, తనకు ఆ సామాజిక వర్గం వెన్నుదన్నుగా నిలుస్తోందన్న వాదనలపైనా పవన్ సర్కాస్టిక్ గా స్పందించారు. కాపులంతా తనకు మద్దతుగా ఉన్నారని అనుకుంటే.. తాను రెండు చోట్ల ఎలా ఓడిపోతానని ప్రశ్నించారు.

కాపులంతా తన వెనకే ఉంటే తాను భీమవరంతో పాటు గాజువాకలో కూడా ఓడిపోకూడదు కదా అని ఆయన అన్నారు. ఇవన్ని ఒట్టి పుకార్లేనని, అయినా మిమ్మల్ని ఎలా నమ్మేది అంటూ ఆయన ఓ రేంజిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు రంగా భయం వెలిబుచ్చినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నవారంతా చిన్నపిల్లలేమీ కాదు కదా అని కూడా పవన్ వ్యాఖ్యానించి అందరినీ షాక్ కు గురి చేశారు.