జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మార్మోగుతోంది. ఎక్కడ చూసినా ఏ నలుగురు కలిసినా ఎమ్మెల్యే తీరును ప్రశంసిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ అండగా ఉంటున్నారని, అన్ని సామాజిక వర్గాలను పట్టించుకుంటున్నారని పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. నిజానికి ఈ తరహా చర్చ రాష్ట్రంలో జరగడం ఇదే తొలిసారి. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు -ఎమ్మెల్యేలకు మధ్య సంబంధం బాగా ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం కొంత వ్యతిరేకత కనిపించిన పరిస్థితి ఉంది.
కానీ ఇప్పుడు దానికి భిన్నంగా పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ జపం మార్మోగుతోంది. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ విషయంలో పాజిటివ్ గా స్పందిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఒక సామాజిక వర్గం బలంగా పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడింది. 70 వేల ఓట్ల మెజారిటీ దక్కించుకుని విజయం సాధించారు. అయితే ఆ సామాజిక వర్గానికి మాత్రమే పవన్ కళ్యాణ్ పరిమితం కాకుండా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఆయన పట్టించుకుంటున్నారు.
ఆ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే క్రమంలో మరింత వేగంగా స్పందిస్తున్నారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు లేకపోగా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పిఠాపురంలో ఎటుచూసినా సిమెంట్ రోడ్లు.. రహదారుల సుందరీకరణ.. గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అదేవిధంగా ఉప్పాడ వంటి ప్రాంతాల్లో మత్స్యకారులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అదే విధంగా కొబ్బరి రైతులకు సంబంధించి గత కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యను కూడా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. సముద్ర తీరంలో రక్షణ గోడ నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక వ్యక్తిగతంగా కూడా సమస్యలు పరిష్కరించేందుకు చొరవచూపుతున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరిని కదిలించినా పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తుండడం విశేషం. దీనికి తోడు వైసిపి నుంచి వచ్చిన దొరబాబు పార్టీ కార్యక్రమాలను నిశితంగా గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు అండగా కూడా ఉంటున్నారు. మొత్తంగా ఈ పరిణామాలు పిఠాపురం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికి ఏకపక్ష విజయాన్ని దక్కించే అవకాశం ఉందన్న చర్చకు దారితీస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
